రూ. 1.81 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నాం
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, గీసుగొండ: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15, 16వ డివిజన్లలో రూ. 1.81 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు హనుమకొండ జిల్లా కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్ పాయ్, మాజీ మేయర్ గుండు సుధారాణితో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తూనే మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. 16వ డివిజన్లోని కీర్తినగర్లో రూ. 80 లక్షలతో పార్కు అభివృద్ధి పనులు, ధర్మారం గరీబ్నగర్లో రూ. 11 లక్షలతో మంచినీటి పైప్లైన్ నిర్మాణం, మొగిలిచర్లలో రూ. 80 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, రెడ్డిపాలెంలో రూ. 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి కొనసాగుతుందని, చేపట్టిన పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, 15, 16వ డివిజన్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

