లారీ డ్రైవర్లకు డ్రంక్ డ్రైవ్ పరీక్షలు
ధర్మవరం క్వారీలో కొత్త నిబంధన
కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా వాజేడు మండలంలోని ధర్మవరం ఇసుక క్వారీలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి క్వారీకి వచ్చే ప్రతి లారీ డ్రైవర్కు డ్రంక్ డ్రైవ్ పరీక్షలను తప్పనిసరి చేశారు. టీజీఎండీసీ అధికారులు, క్వారీ నిర్వాహకుల సమన్వయంతో ఈ కొత్త నిబంధనను అమలు చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో ఇసుక లారీల నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టారు. మద్యం సేవించినట్లు తేలిన డ్రైవర్లకు లోడింగ్ను నిలిపివేసి, వాహనాలను వెనక్కి పంపుతున్నారు. మద్యం సేవించలేదని నిర్ధారణ అయిన తర్వాతే వాహనాలను లోడింగ్ పాయింట్లోకి అనుమతిస్తున్నారు. రోడ్డు భద్రతకు దోహదపడే ఈ విధానాన్ని జిల్లాలోని అన్ని ఇసుక క్వారీల్లోనూ అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి తనిఖీలను నిరంతరం కొనసాగిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

