- కాళేశ్వరంపై దుష్ప్రచారంతోనే అధికారంలోకి కాంగ్రెస్
- సాగునీటి అవసరాలను పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం
- పాకాల, రంగయ్య చెరువు మోటార్లు వెంటనే ప్రారంభించాలి
- ప్రభుత్వం స్పందించకపోతే రైతుల ప్రత్యక్ష పోరాటం
- మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హెచ్చరిక
- స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై తీవ్ర విమర్శలు
కాకతీయ, ఖానాపూర్ : కాలేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు రైతుల సాగునీటి అవసరాలను పూర్తిగా విస్మరించిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఖానాపురం మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గోదావరిలో సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
రైతుల కోసం నీళ్లు అడిగితే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనుచిత భాషలో మాట్లాడుతున్నారని సుదర్శన్రెడ్డి మండిపడ్డారు. రిటైర్డ్ ఇంజినీర్లు, మేధావులను అవమానించే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. తన హయాంలో రామప్ప, పాకాల, రంగయ్య చెరువు ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చి వేలాది ఎకరాలకు సాగునీరు అందించామని, ఇప్పుడు కనీసం నారుమళ్లకు కూడా నీళ్లు అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై పెద్ది సుదర్శన్రెడ్డి ఆగ్రహం
ఎల్నినో ప్రభావం ఉంటుందని ముందే హెచ్చరించినా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని సుదర్శన్రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాకాలలో నీటి మట్టం తక్కువగా ఉన్నప్పటికీ నారుమళ్లకు నీరు అందించామని గుర్తు చేశారు. దేవాదుల, సమ్మక్క బ్యారేజీ వద్ద భారీగా నీటి ప్రవాహం ఉన్నా, ప్రభుత్వ అసమర్థత కారణంగా రైతులు కరువు కష్టాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రామప్ప చెరువులో 26 అడుగుల నీరు ఉన్నా, పాకాల ప్రాజెక్టు మోటార్లు ఎందుకు నడపడం లేదని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ఇప్పటివరకు ప్రాజెక్టులను సందర్శించలేదని, కనీసం అధికారులతో సమీక్ష కూడా నిర్వహించలేదని సుదర్శన్రెడ్డి ఆరోపించారు. నార్లు వేసే సమయం ముగిసిపోతున్నందున, రేపటి నుంచే పాకాల, రంగయ్య చెరువు ప్రాజెక్టుల మోటార్లను ప్రారంభించి రైతులకు నీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులు ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యేపై ప్రత్యక్ష పోరాటాలు చేపడతారని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల స్థాయి నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

