ఏసీబీ వలలో మున్సిపల్ ఏఈ సతీష్ కుమార్
రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ
నివాసంలో రూ. 32.31 లక్షల అదనపు నగదు గుర్తింపు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : పనులు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ అసిస్టెంట్ ఇంజనీర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న కల్లెపల్లి సతీష్ కుమార్, కాంట్రాక్టు బిల్లుల ప్రక్రియ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడ, కునారం రోడ్డులో ఉన్న హిందూ శ్మశానవాటిక అభివృద్ధి పనులకు సంబంధించి రూ. 12,28,748 విలువైన ఫైనల్ బిల్లును ప్రాసెస్ చేసేందుకు, సదరు ఏఈ సతీష్ కుమార్ రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కరీంనగర్ ఏసీబీ అధికారులు, మంగళవారం సతీష్ కుమార్ నివాసంలో ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం తీసుకున్నట్లుగా నిర్ధారించుకున్న అధికారులు, అనంతరం సతీష్ కుమార్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో లేని అదనంగా రూ. 32,31,900 నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడినందుకు సదరు ఏఈని అదుపులోకి తీసుకుని, కరీంనగర్లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు అధికారులు పేర్కొన్నారు.

