ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు వినతిపత్రం అందజేత
హైదరాబాదులో ఉద్యమకారుల సమన్వయ సమావేశం
కాకతీయ, తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమ నాయకుడు దుగ్యాల రవీందర్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాదులోని తెలంగాణ అమర జ్యోతి కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉద్యమకారుల సమన్వయ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డిలకు వినతిపత్రాలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలులో జాప్యం జరుగుతోందని, ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ గుర్తింపు కార్డులు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండలం నుంచి ఎస్కే జానీ, బుద్దా ప్రవీణ్, వర్దేల్లి మహేష్, మేడుదుల లింగరాజు, ఎశమల్ల భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

