శ్రీశైలం నీటిని ఏపీ తరలిస్తున్నా.. చూస్తూ ఊరుకుంటారా?
సాగర్ నీటిపై జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలి
పోతిరెడ్డిపాడు ద్వారా 148 టీఎంసీల తరలింపు
ఎడమ కాల్వ, లిఫ్టులకు వెంటనే నీళ్లు విడుదల చేయాలి
నీటి వాటా సాధించేంత వరకు రైతుల తరఫున పోరాడుతాం
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
కాకతీయ, నల్లగొండ : శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ నిత్యం నీటిని తరలించుకుపోతున్నా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వారి నిర్లక్ష్యం వల్లే జిల్లాలో వ్యవసాయం ఆగమవుతోందని ఆరోపించారు. సాగర్లో 532 అడుగుల నీటిమట్టం ఉందని, సుమారు 30 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఎడమ కాల్వకు నీరు విడుదల చేయకపోవడానికి కారణమేంటో జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీశైలంలోకి వరద వస్తున్నా ఆ నీరు పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రాకు తరలిపోతోందని ఆరోపించారు. రైతుల నీటి వాటా కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. శుక్రవారం నల్లగొండలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, కంచర్ల భూపాల్రెడ్డి, నేతలు కంచర్ల కృష్ణారెడ్డి, ఒంటెద్దు నర్సింహారెడ్డితో కలిసి జగదీశ్రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగార్జునసాగర్ నీటిని ఏపీ యథేచ్ఛగా తరలించుకుపోతున్నా జిల్లా మంత్రులు నోరు మెదపడం లేదని విమర్శించారు. తాను ఆధారాలతో సహా ఆంధ్రా నీటి దోపిడీని ప్రజల ముందు ఉంచుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు.
రాయలసీమ ప్రాజెక్టులన్నీ నింపుకున్నారు
శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని మళ్లించుకుంటున్నారని జగదీశ్రెడ్డి ఆరోపించారు. సాగర్ ఓవర్ఫ్లో అయి సముద్రంలోకి నీటిని విడుదల చేసిన సమయంలో మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకెళ్లాలనే నిబంధన ఉందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆ నిబంధనలను పట్టించుకోకుండా నీటిని తరలించుకుపోతున్నారని అన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకెళ్లి రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను నింపుకున్నారని ఆరోపించారు. సాగర్లో నీటిమట్టం తక్కువగా ఉన్న సమయంలోనూ తెలంగాణలో సాగుకు నీరు అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని జగదీశ్రెడ్డి అన్నారు. వరుసగా 17 సార్లు సాగునీరు అందించామని, ఎడమ కాల్వ కింద ఉన్న లిఫ్టులకు కూడా పుష్కలంగా నీటిని విడుదల చేశామని చెప్పారు. ఇప్పుడు సాగర్లో నీరు ఉన్నా రైతులకు నీరు ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తోందని ప్రశ్నించారు.
ఎడమ కాల్వతో పాటు లిఫ్టులకూ నీళ్లు
సాగర్ ఆయకట్టు రైతులకు వెంటనే నీటిని విడుదల చేయాలని జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఎడమ కాల్వకు మాత్రమే కాకుండా దాని పరిధిలోని లిఫ్టులకు కూడా నీటిని విడుదల చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో పంటలు సాగవుతున్నప్పుడు తెలంగాణ రైతులకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సాగర్ నీరు తెలంగాణ రైతుల హక్కు అని స్పష్టం చేశారు. జిల్లా మంత్రులు పదవుల భయంతో ఆంధ్రప్రదేశ్కు లొంగిపోయి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని జగదీశ్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డిని గెలిపించి సాగర్ ఆయకట్టు రైతులు తప్పు చేశారని, ఇప్పటికైనా రైతులు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలను గ్రామాల్లో నిలదీసి సాగునీటి కోసం ప్రశ్నించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు పోతిరెడ్డిపాడు ద్వారా 148 టీఎంసీల నీటిని తరలించుకుపోయారని అన్నారు. ఇది ఎల్నినో వల్ల వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కరువు అని విమర్శించారు. యాగాల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. శ్రీశైలంలోకి వస్తున్న నీరు ఎక్కడికి వెళ్తుందో అందరికీ తెలుసని, పోతిరెడ్డిపాడు ద్వారా ఆ నీటిని ఆంధ్రాకు తరలిస్తున్నారని అన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను సాధించే వరకు బీఆర్ఎస్ రైతుల తరఫున పోరాడుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్తో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని, ఎలాగైనా తెలంగాణ నీటి వాటాను సాధిస్తామని జగదీశ్రెడ్డి తెలిపారు.

