రేషన్ కార్డుకు ఈ-కేవైసీ తప్పనిసరి
31వరకే గడువు..రేషన్ దక్కాలంటే పూర్తి చేయాల్సిందే
సకాలంలో పూర్తి చేయకుంటే నిలిచిపోనున్న రాయితీలు
కుటుంబంలోని ప్రతి సభ్యుడి బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి
స్థానిక రేషన్ దుకాణాలు లేదా మీసేవా కేంద్రాల్లో అవకాశం
ఉచితంగానే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయనున్న పౌర సరఫరాల శాఖ
జూలై 31 తర్వాత సంక్షేమ పథకాలకు దూరం కానున్న లబ్ధిదారులు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : రేషన్ కార్డుదారులందరూ అత్యంత ప్రాధాన్యతతో ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. జూలై 31ని తుది గడువుగా నిర్ణయించిన నేపథ్యంలో కార్డుదారులు నిర్లక్ష్యం వహించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. గడువులోపు ప్రక్రియను పూర్తి చేయని కుటుంబాలకు ఇకపై రాయితీ రేషన్ అందకపోగా, ఆహార భద్రతా కార్డు ద్వారా పొందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా నిలిచిపోయే అవకాశం ఉందని శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా, పక్కాగా అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
సభ్యులందరూ హాజరు కావాల్సిందే
రేషన్ కార్డులో నమోదైన కుటుంబ సభ్యులందరూ వ్యక్తిగతంగా హాజరై తమ బయోమెట్రిక్ లేదా ఐరిస్ స్కాన్ ద్వారా ధృవీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలో కేవలం యజమాని వివరాలు నమోదు చేస్తే సరిపోదని కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరుకావాలని అధికారులు చెబుతున్నారు. కొందరు కార్డుదారులు ఈ విషయాన్ని గుర్తించక కేవలం ఒకరిద్దరితోనే వస్తున్నారు దీనివల్ల కార్డు పూర్తిస్థాయిలో యాక్టివ్ అయ్యే అవకాశం ఉండదు. ఇప్పటికైనా కార్డుదారులు కుటుంబ సభ్యులందరినీ వెంటపెట్టుకుని వెళ్లడం ద్వారా ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అందుబాటులో లేకపోతే వారి పరిస్థితిపై స్థానిక రేషన్ డీలర్లను సంప్రదించి తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
వ్యాపారుల వేధింపులపై కఠిన చర్యలు
ప్రక్రియను సులభతరం చేసేందుకు స్థానిక ఫెయిర్ ప్రైస్ షాపులు లేదా సమీప మీసేవా కేంద్రాలను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ఒరిజినల్ రేషన్ కార్డుతో పాటు కార్డులో నమోదైన ప్రతి కుటుంబ సభ్యుడి ఆధార్ కార్డులను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ సేవలు పూర్తిగా ఉచితమని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని పౌర సరఫరాల శాఖ హెచ్చరించింది. అక్రమాలకు పాల్పడే డీలర్లు లేదా మీసేవా కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వం కార్డుదారులకు భరోసా కల్పిస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో డీలర్లు ఉచితంగానే ప్రక్రియను పూర్తి చేస్తున్నారు అయినప్పటికీ కొందరు అక్రమార్కులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తుండటంతో ప్రభుత్వం దృష్టి సారించింది.
నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకే ప్రాధాన్యత
రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకే చేరాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం. గడువు ముగిసిన తర్వాత కూడా కేవైసీ పూర్తి చేయని వారిని క్రియాశీలకంగా లేని లబ్ధిదారులుగా పరిగణించి వారి పేర్లను తొలగించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అనేకమంది చనిపోయిన వారు లేదా వలస వెళ్లిన వారి పేర్లు రేషన్ కార్డుల్లోనే ఉండిపోవడంతో వీటిని తొలగించి లబ్ధిదారుల జాబితాను శుద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల అనర్హులకు అందే సబ్సిడీలను నియంత్రించడంతో పాటు ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుంది. కార్డుదారులు కూడా బాధ్యతతో వ్యవహరించి తమ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా సంక్షేమ పథకాలను నిరంతరాయంగా పొందవచ్చు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా సకాలంలో ప్రక్రియ పూర్తి చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం అని విద్యాశాఖ సూచిస్తోంది. ఇప్పటి వరకు చాలా మంది ఈ-కేవైసీ పూర్తి చేసినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో నమోదు జరగాల్సి ఉందని అంచనా వేస్తున్నారు.

