హైడ్రా చీఫ్కు హైకోర్టు షాక్
రంగనాథ్ను కమిషనర్ పదవి నుంచి తప్పించాలని ఆదేశాలు
ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని స్పష్టీకరణ
లోతుకుంట భూముల వ్యవహారంలో కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై తీవ్ర ఆగ్రహం
బేషరతు క్షమాపణను నమోదు చేసినా.. పదవి నుంచి తొలగించాలని ఉత్తర్వులు
హైడ్రా పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం
ప్రభుత్వం అప్పీలుకు వెళ్తుందా.. కొత్త అధికారిని నియమిస్తుందా?
కాకతీయ,తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సంస్థ హైడ్రాకు తెలంగాణ హైకోర్టు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. హైడ్రా కమిషనర్గా ఉన్న ఐఏఎస్ అధికారి ఏవీ రంగనాథ్ను ఆ పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆయన స్థానంలో ఐజీ కేడర్కు చెందిన సీనియర్ పోలీసు అధికారిని నియమించాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. లోతుకుంట పరిధిలోని భూముల వ్యవహారంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ వ్యవహరించారన్న ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం ఈ సంచలన ఉత్తర్వులు వెలువరించింది. హైడ్రా చర్యలు చట్టబద్ధంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సాగాలంటే ఉన్నత స్థాయి పోలీసు అధికారి పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడింది. లోతుకుంట భూముల వివాదంలో కోర్టు ఆదేశాలను పాటించకుండా చర్యలు చేపట్టారన్న ఆరోపణలపై హైకోర్టు గతంలోనే రంగనాథ్కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘ విచారణ అనంతరం హైడ్రా తరఫున రంగనాథ్ సమగ్ర అఫిడవిట్ను కోర్టుకు సమర్పించారు. తాము చేపట్టిన చర్యలకు సంబంధించిన చట్టపరమైన వివరణలను అందజేయడంతో పాటు, న్యాయస్థానం సూచించిన మేరకు జరిగిన పొరపాట్లపై వ్యక్తిగతంగా బేషరతు క్షమాపణ పత్రాన్ని కూడా దాఖలు చేశారు.
క్షమాపణ సరిపోలేదు… చర్యలు తప్పలేదు
రంగనాథ్ సమర్పించిన క్షమాపణను రికార్డులోకి తీసుకున్నప్పటికీ, కోర్టు ధిక్కరణ, అధికార పరిధిని మించి వ్యవహరించారన్న అంశాలను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, చెరువుల పరిరక్షణ పేరుతో చేపడుతున్న చర్యల్లో చట్టపరమైన ప్రక్రియను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే హైడ్రాకు ఐజీ స్థాయి అధికారిని కమిషనర్గా నియమించడం సముచితమని పేర్కొంది. హైడ్రా వంటి సున్నితమైన సంస్థలో చట్టబద్ధత, పారదర్శకత, శాంతిభద్రతల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. అధికార యంత్రాంగం చట్ట పరిధిలోనే పనిచేయాలన్న సందేశాన్ని ఈ తీర్పు ద్వారా స్పష్టంగా ఇచ్చినట్లు న్యాయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ప్రభుత్వం తదుపరి అడుగు ఏంటి?
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు, దాని కమిషనర్గా ఉన్న రంగనాథ్కు ఈ తీర్పు కీలక ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం వెంటనే రంగనాథ్ను తప్పించి కొత్త ఐజీ స్థాయి అధికారిని నియమిస్తుందా, లేక ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందా అన్నది ఇప్పుడు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల తొలగింపులో దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ, చట్టపరమైన ప్రక్రియల విషయంలో తరచూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజా హైకోర్టు తీర్పు నేపథ్యంలో హైడ్రా పనితీరులో మార్పులు వస్తాయా, లేక ప్రభుత్వం న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

