సరిహద్దులు దాటుతున్న సన్నబియ్యం
పీడీఎస్ దందాకు అడ్డాగా ఉత్తర తెలంగాణ
కోట్లు కొల్లగొడుతున్న స్మగ్లర్ వీరప్పన్
అధికారులతో దోస్తీ..యంత్రాంగాన్ని గుప్పిట పట్టిన డాన్
స్వర్గధామంగా మారిన పేదల సంక్షేమ పథకం
మండల స్థాయి నుంచి సిరొంచ వరకు విస్తరించిన నెట్వర్క్
రేషన్ బియ్యం పక్కదారి పడుతుంటే యంత్రాంగం మౌనమెందుకు?
టాస్క్ఫోర్స్, విజిలెన్స్, సివిల్ సప్లైస్ వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు
పేదల బియ్యం బ్లాక్మార్కెట్కు చేరుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందా?

కాకతీయ,తెలంగాణ బ్యూరో : ఉత్తర తెలంగాణలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా ఇప్పుడు చర్చనీయాంశం కాదు… బహిరంగ రహస్యంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం సరిహద్దులు దాటి మహారాష్ట్ర మార్కెట్లకు చేరుతోంది. బియ్యం దందాలో వీరప్పన్గా చెలామణి అవుతున్న స్మగ్లర్ కీలక పాత్ర పోషిస్తూ..మొత్తం వ్యవస్థను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడం గమనార్హం. ఉత్తర తెలంగాణలో జిల్లాల్లాన్నింటిలోనూ బలమైన నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్న సదరు స్మగ్లర్ గ్రామాల నుంచి బియ్యం సేకరణ… నిల్వ కేంద్రాలకు తరలింపు… అక్కడి నుంచి సిరొంచ వైపు రవాణా… చివరకు బ్లాక్మార్కెట్లో విక్రయం వరకు ఒక పక్కా వ్యవస్థను నిర్మించుకోవడం గమనార్హం. ఈ దందా ఒకరోజులో పుట్టింది కాదు. నెలల తరబడి సాగుతోంది. అయినా యంత్రాంగం చేతిలో ఒక్క పెద్ద సూత్రధారి కూడా చిక్కకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. చిన్న దళారులు, డ్రైవర్లు మాత్రమే కేసుల్లో కనిపిస్తుంటే, అసలు నెట్వర్క్ మాత్రం మరింత బలపడుతుండటంపై ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
సరిహద్దు ప్రాంతాలన్నీ ఒకే గొలుసు..!
బెజ్జూరు, కౌటాల, చింతలమానేపల్లి, సిర్పూర్(టి), మహదేవ్పూర్, మంథని, కాలేశ్వరం పరిసర ప్రాంతాలు ఈ అక్రమ రవాణాకు కీలక మార్గాలుగా మారుతున్నాయి. రేషన్ పంపిణీ పూర్తికాగానే గ్రామాల్లో దళారులు రంగంలోకి దిగుతున్నారు. లబ్ధిదారుల నుంచి కిలో రూ.10 నుంచి రూ.15కు బియ్యం కొనుగోలు చేసి గోదాములకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి చిన్న చిన్న వాహనాల్లో విడతల వారీగా సరిహద్దు దాటించి మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతానికి చేర్చుతున్నారు. ప్రతి మండలానికి ప్రత్యేక సమన్వయకర్తలు, సేకరణదారులు, రవాణాదారులు పనిచేస్తున్నారని, ఒక్కో గ్రామంలో ఎవరెవరిని సంప్రదించాలో కూడా ముందుగానే నిర్ణయించుకున్న నెట్వర్క్ పనిచేస్తోంది.
మహదేవ్పూర్ కేంద్రంగా విస్తరణ..!
మహదేవ్పూర్ను ఈ దందాకు ప్రధాన ట్రాన్సిట్ పాయింట్గా మార్చుకున్నారు. స్థానికంగా ఓ కీలక వ్యక్తితో కలిసి నెట్వర్క్ను విస్తరించారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల నుంచి సేకరించిన బియ్యాన్ని ముందుగా ఇక్కడ నిల్వ చేసి, అనంతరం రాత్రివేళల్లో వాహనాల ద్వారా సిరొంచకు తరలిస్తున్నారు. రోజూ వందల టన్నుల బియ్యం సరిహద్దు దాటుతున్నాయి. ఇంత పెద్ద స్థాయిలో రవాణా జరుగుతుంటే సంబంధిత శాఖలకు ఎలా తెలియదనే ప్రశ్న తలెత్తుతోంది. స్థానికంగా ఈ దందా గురించి మాట్లాడితే ముందుగా వినిపించే పేరు ‘వీరప్పన్సదే. ఇంత బహిరంగంగా పేరు వినిపిస్తున్నప్పటికీ, ఆ నెట్వర్క్పై సమగ్ర దర్యాప్తు జరిగిందా? ఆర్థిక లావాదేవీలు పరిశీలించారా? ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు కనిపించడం లేదు. చిన్న చిన్న పట్టివేతలతో దందా ఆగిపోతుందా? లేక అసలు సూత్రధారుల వరకు దర్యాప్తు వెళ్లాల్సిన అవసరం లేదా? అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఒకవైపు పట్టుబడుతున్న బియ్యం పరిమాణం పెరుగుతుంటే, మరోవైపు అక్రమ రవాణా మాత్రం యథేచ్ఛగా కొనసాగుతుండడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.
యంత్రాంగం మౌనం ఎందుకు..?
రేషన్ బియ్యం గ్రామాల నుంచి బయటకు రావాలి. నిల్వ కేంద్రాలకు చేరాలి. వాహనాల్లో లోడింగ్ కావాలి. చెక్పోస్టులు దాటాలి. రాష్ట్ర సరిహద్దు దాటాలి. ఇవన్నీ ఒకేరోజులో జరిగే వ్యవహారాలు కావు. ప్రతి దశలో ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ ఉండాల్సిందే. అయినా ఈ అక్రమ రవాణా నిరాటంకంగా సాగుతోందంటే యంత్రాంగం పూర్తిగా విఫలమైందా? లేక వ్యవస్థలోని కొందరి నిర్లక్ష్యం, మరికొందరి మౌనం కారణమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సివిల్ సప్లైస్, రెవెన్యూ, పోలీసు, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్… ఇన్ని విభాగాలు ఉన్నా అక్రమ రవాణాపై పెద్ద స్థాయిలో ఉమ్మడి ఆపరేషన్ కనిపించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ రవాణా ఆగిందని భావించి నిఘా సడలించారా? లేక సమాచారం ఉన్నా పట్టించుకోవడం లేదా? అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి.
టాస్క్ఫోర్స్ ఏం చేస్తోంది..?
ఆహార ధాన్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసిన ఉద్దేశమేంటి? విజిలెన్స్ విభాగం పని ఏమిటి? ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఎక్కడ ఉన్నాయి? నెలల తరబడి ఒకే ప్రాంతంలో ఒకే తరహా దందా కొనసాగుతుంటే పెద్ద స్థాయి దాడులు ఎందుకు జరగడం లేదు? అక్రమ నెట్వర్క్ను మూలాలతో సహా ఎందుకు కూల్చివేయడం లేదు? అప్పుడప్పుడు కొన్ని వాహనాలు పట్టుకోవడం, కొన్ని బస్తాలు స్వాధీనం చేసుకోవడం, చిన్న దళారులపై కేసులు నమోదు చేయడం తప్ప అసలు నెట్వర్క్పై దృష్టి పడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో టాస్క్ఫోర్స్, విజిలెన్స్ వ్యవస్థల ప్రభావంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పేదల కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకం బ్లాక్మార్కెట్కు ముడిసరుకుగా మారితే దానికి బాధ్యత ఎవరిది? ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం సరిహద్దులు దాటి అక్రమ మార్కెట్లకు చేరుతుంటే ఇది కేవలం దళారుల పని మాత్రమేనా? లేక పర్యవేక్షణలో భారీ వైఫల్యమా? ప్రజల పన్నుల డబ్బుతో కొనుగోలు చేసిన బియ్యం పేదల గిన్నెల్లో కాకుండా స్మగ్లర్ల గోదాముల్లో కనిపిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
ఉత్తర తెలంగాణలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర దర్యాప్తు, సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేక నిఘా, మొత్తం నెట్వర్క్ ఆర్థిక లావాదేవీలపై విచారణ, సంబంధిత అధికారుల బాధ్యత నిర్ధారణ వంటి చర్యలు తీసుకోకపోతే ఈ దందా మరింత విస్తరించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పేదల కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకం స్మగ్లర్లకు ఆదాయ వనరుగా మారిందనే విమర్శలను ప్రభుత్వం ఇకనైనా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

