స్క్రాప్ నెట్వర్క్ మాఫియా..
మణుగూరు టు విజయవాడ వరకు విస్తరణ
3వేల కేజీల కాపర్లో 300 కేజీలే స్వాధీనం?
మిగతా 2,700 కేజీల ఆచూకీ ఎక్కడ..?
కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సగంలోనే ఆగిపోయిందా..?
బీటీపీఎస్, సింగరేణి కేసులతోనూ సంబంధాలపై ప్రశ్నలు
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: మణుగూరులో వెలుగులోకి వచ్చిన కాపర్ దొంగతనం కేసు క్రమంగా జిల్లాల సరిహద్దులు దాటి మణుగూరు–విజయవాడ స్క్రాప్ నెట్వర్క్ వైపు దర్యాప్తు మళ్లాల్సిన అవసరం ఉందనే చర్చ పెరుగుతోంది. దొంగతనాలకు పాల్పడిన యువకుల అరెస్టులతో కేసు ఒక దశకు చేరుకున్నప్పటికీ, దొంగిలించిన కాపర్ ఎవరికి విక్రయించబడింది, ఏ మార్గంలో తరలించబడింది, చివరకు ఎక్కడికి చేరింది అనే ప్రశ్నలు మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి. దర్యాప్తు పూర్తిగా కొనుగోలు గొలుసుపైకి వెళ్లకపోతే ఈ కేసులోని అసలు నెట్వర్క్ వెలుగులోకి రాదని స్థానికంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తులో బయటకు వచ్చిన వివరాల ప్రకారం దొంగతనాల పరిమాణం సుమారు 3,000 కిలోల కాపర్ వరకు ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడైన పరిమాణం 300 కిలోలకే పరిమితమైందన్న సమాచారం చర్చకు దారితీసింది. దీంతో మిగిలిన 2,700 కిలోల కాపర్ ఎక్కడ ఉంది? అనే ప్రశ్న సహజంగానే ముందుకు వస్తోంది. ఆ సరుకు ఇంకా ఎక్కడైనా నిల్వ ఉందా? ఇప్పటికే స్క్రాప్ యార్డుల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించబడిందా? లేక దర్యాప్తు కొనసాగుతున్నందున ఇంకా స్వాధీనం చేయాల్సి ఉందా? అనే అంశాలపై పోలీసులు అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉందని స్థానికులు కోరుతున్నారు.
కొనుగోళ్ల వ్యవహారమే అసలు కీలకమా..?
దొంగతనం జరిగిన తర్వాత దొంగిలించిన కాపర్ మార్కెట్కు చేరకుండా ఉండడం సాధ్యం కాదని స్క్రాప్ వ్యాపార వర్గాలే చెబుతున్నాయి. అలాంటప్పుడు ఆ కాపర్ను ఎవరు కొనుగోలు చేశారు? ఎక్కడ నిల్వ చేశారు? తర్వాత ఎక్కడ విక్రయించారు? అనే అంశాలే ఈ కేసులో కీలకంగా మారాయి. దొంగిలించిన సరుకును కొనుగోలు చేసిన వారి పాత్ర, ఆర్థిక లావాదేవీలు, రవాణా మార్గాలు, డిజిటల్ చెల్లింపులు వంటి అంశాలను పూర్తిగా పరిశీలిస్తేనే అసలు నెట్వర్క్ బయటపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నేరంలో పాల్గొన్నవారితో పాటు నేరం ద్వారా లాభం పొందినవారి పాత్రను కూడా సమానంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కేసులో విజయవాడకు సంబంధించిన స్క్రాప్ వ్యాపార సంబంధాలపై స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఆ కోణంలో దర్యాప్తు ఎంతవరకు సాగింది? సంబంధిత వ్యక్తుల నుంచి వివరాలు సేకరించారా? సరుకు రవాణా వివరాలను పరిశీలించారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతర్జిల్లా స్క్రాప్ నెట్వర్క్ ఉన్నట్లు తేలితే, ఒకే జిల్లాలోని దర్యాప్తుతో కేసు పూర్తి కావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైతే ఇతర జిల్లాల పోలీసులతో సమన్వయం చేసి మొత్తం సరుకు మార్గాన్ని గుర్తించాలని పలువురు సూచిస్తున్నారు.
పాత కేసులతో పోలికలు
గతంలో బీటీపీఎస్, సింగరేణి పరిధిలో నమోదైన స్క్రాప్, కాపర్ దొంగతనాల కేసులను కూడా ఈ కేసుతో పోల్చి పరిశీలించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గతంలో స్వాధీనం చేసుకున్న సరుకు, అప్పటి నిందితులు, ప్రస్తుతం బయటకు వస్తున్న వివరాల మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలించాలని సూచిస్తున్నారు. అయితే ఈ కేసుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. ఈ కేసులో ఇప్పటికీ సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. 2,700 కిలోల కాపర్ ఆచూకీ, కొనుగోలు చేసిన వారి పాత్ర, స్క్రాప్ యార్డుల ద్వారా జరిగిన సరుకు చలామణి, డిజిటల్ లావాదేవీలు, ఇతర జిల్లాలతో సంబంధాలు వంటి అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రజల్లో వినిపిస్తున్న ప్రధాన డిమాండ్ ఒక్కటే… అరెస్టులతోనే కేసు ముగిసిందనే భావన కలగకుండా, దొంగతనం నుంచి కొనుగోలు, రవాణా, విక్రయం వరకు మొత్తం స్క్రాప్ నెట్వర్క్ను ఛేదించేలా దర్యాప్తు ముందుకు సాగాలి. అప్పుడే మిగిలిన కాపర్ ఆచూకీతో పాటు కేసులోని అన్ని కోణాలపైనా స్పష్టత వచ్చే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు.

