మారెళ్లపాడు పంప్ హౌస్ పనులు వేగవంతం చేయాలి
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం
కాకతీయ, మణుగూరు రూరల్: మండలంలోని మారెళ్లపాడు పంప్ హౌస్ నిర్మాణ పనులను శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు. పంపుల ఏర్పాటు, మోటార్ల కప్లింగ్, ప్రెషర్ మెయిన్ పైప్లైన్, తుమ్మల చెరువు ఫీడర్ కాలువ పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ ప్రతినిధులను ఆదేశించారు. ప్రాజెక్టు పూర్తయితే ఆయకట్టు రైతులకు సాగునీరు సులభంగా అందుబాటులోకి వచ్చి వ్యవసాయానికి మేలు జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, ఇంజనీర్లు, మండల అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

