పాడి పంటలు చల్లగా చూడాలమ్మా
రాయపర్తిలో ఉట్టిపడిన భక్తి పారవశ్యం
ఘనంగా మారెమ్మ, ముత్యాలమ్మ బోనాలు
మారుమోగిన డప్పుచప్పుళ్లు.. శివసత్తుల పూనకాలు
అమ్మవార్లకు మొక్కులు చెల్లించిన భక్తజనం
కాకతీయ, రాయపర్తి : వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు చల్లగా ఉండాలని, గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించాలని భక్తులు గ్రామ దేవతలను వేడుకున్నారు. ఆదివారం రాయపర్తి మండల కేంద్రంలో మారెమ్మ, ముత్యాలమ్మ తల్లుల బోనాల పండగ ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించారు. మహిళలు నిష్టతో సిద్ధం చేసిన బోనాలను శిరస్సున ధరించి మంగళ వాయిద్యాలు, డప్పుచప్పుళ్ల నడుమ ఊరేగింపుగా ఆలయాలకు చేరుకున్నారు. ఆలయ ప్రాంగణాలు భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. మహిళలు అమ్మవార్లకు నైవేద్యంగా బోనం సమర్పించి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా చెల్లించే మొక్కుల్లో భాగంగా భక్తులు పొట్టేళ్లు, మేకలు, కోళ్లను సమర్పించారు. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బంధుమిత్రుల రాకతో ప్రతి ఇంటా పండుగ సందడి కనిపించింది. గ్రామ దేవతల ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల ఉత్సవాలను విజయవంతం చేశారు.

