ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధంకండి
ప్రజా ప్రభుత్వంలో డెబ్భై వేల ఉద్యోగాలు భర్తీ
ఆరోగ్య శాఖలోనే దాదాపు ఇరవై వేల కొలువులు
మంత్రి దామోదర రాజనర్సింహ
మహిళా బిల్లు విషయంలో బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డిలో జిల్లా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని, పార్టీ నాయకుల మధ్య వర్గపోరు ఉండొద్దని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్లో మంగళవారం సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రితో పాటు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు, పఠాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… ప్రభుత్వం , పార్టీ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తేనే విజయం సాధిస్తామని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచామని, మున్సిపల్ ఎన్నికల్లో సైతం అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నామన్నారు. అయినప్పటికీ జిల్లాలో ఇంకా నాయకుల మధ్య సమన్వయం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలను చేపట్టినా, ఆ సందేశాన్ని, స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళా ల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపైనే ఉంటుందన్నారు.
ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు
ప్రజాప్రభుత్వం ఇప్పటి వరకు డెబ్భై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని.. ఇప్పటి వరకు కేవలం ఆరోగ్య శాఖలోనే దాదాపు ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ను రైతు బంధు రూపంలో రైతులకు అందించామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం గ్రామగ్రామాన విజయవంతంగా అమలవుతోందన్నారు. నలబై ఆరు లక్షల మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు చేపట్టామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా డిజిటల్ హెల్త్ కార్డ్ లు అందించేందుకు కృషి చేస్తున్నా మని తెలిపారు. జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ ఆసుపత్రులలో మరో 50 పడకలు అదనంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి మెడికల్ కళాశాలలో భవిషత్తులో పీజీ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. సింగూరు ప్రాజెక్టు ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 200 కోట్లతో సింగూరు ప్రాజెక్టు ను టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తామన్నారు. విద్య, వైద్యం, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో ప్రభుత్వం ముందుకెళ్తోందని
స్పష్టంచేశారు. మహిళా బిల్లు కు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని సెపరేట్ గా బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందన్నారు. డీలిమిటేషన్ ఉన్నా లేకున్నా మరోసారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
లోపాలు చర్చించాలి
నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ .. ప్రభుత్వ పథకాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా గెలిచాం, మన బలాబలాలు , లోపాలపై చర్చించుకోవాలని అన్నారు. వచ్చే ఎంపీ టీ సి , జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంలో చర్చ జరగాలన్నారు. మూడేళ్లకు పైగా మండలస్థాయిలో పనిచేసిన వారికి, జిల్లా స్థాయిలో పదవులు ఇచ్చి, వారి స్థానంలో మండలం లో కొత్తవారిని నియమించాలని సూచించారు. ప్రభుత్వం ఉన్నది కాబట్టి అభ్యర్థుల ఎంపికలో పోటీ ఉందని, మన మధ్యే మనకే పోటీ వల్ల పార్టీ నష్ట జరుగుతుందన్నారు. మొన్న పార్లమెంట్ లో జరిగిన పరిణామాల ను, ఎందుకు మహిళా బిల్లు ను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందో , మహిళా బిల్లు విషయంలో బీజేపీ కుట్రలను సైతం పార్టీ పరంగా చర్చించాలని.. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె సూచించారు.

