ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలి
కేంద్ర బడ్జెట్లో రూ.3 లక్షల కోట్లు కేటాయించాలి
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు యర్రా శ్రీనివాసరావు
కూసుమంచి ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా
కాకతీయ, కూసుమంచి: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన బిల్లుల వల్ల ఉపాధి హామీ చట్టం నిర్వీర్యమవుతోందని, దేశంలోని నిరుపేద కూలీల ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని కాపాడుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని పద్మారెడ్డి భవనం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు వ్యవసాయ కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం అక్కడ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విబిజి రాంజీ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ బాధ్యతల నుండి తప్పుకోవాలని చూస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు భరించాలనే నిబంధనలు విధిస్తూ భవిష్యత్తులో ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమే కేటాయించడం వల్ల కోట్లాది మందికి పని దొరకడం లేదన్నారు. ఉపాధి హామీకి రూ.3 లక్షల కోట్లు కేటాయించి, ఏడాదికి 200 రోజులు పని కల్పించాలని, రోజువారీ కూలీ రూ.800కి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ హామీలు ఏమైనవి?
రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు నేటికీ అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. వ్యవసాయ కూలీలకు ఏటా ఇస్తామన్న రూ.12,000 నగదు అందడం లేదు. మహిళలకు రూ.2,500 పథకం, పెన్షన్ల పెంపు హామీలు అమలు కాలేదు.
ఉపాధి కూలీకి రూ.400 ఇస్తామన్న హామీ నెరవేరలేదు. జనవరి నుంచి నేటి వరకు మూడు నెలల ఉపాధి బిల్లులు పెండింగ్లో ఉండటంతో పేదలు అర్థాకలితో అలమటిస్తున్నారని అన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు తోటకూరి రాజశేఖర్, కార్యదర్శి చిత్తూరు వెంకన్న, నాయకులు శీలం గురుమూర్తి, రెడ్డిమల్ల వెంకటయ్య, కందుల బాబు, రైతు సంఘం నాయకులు బిక్కసాని గంగాధర్ మరియు పెద్ద సంఖ్యలో వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు.

