గ్రామ స్థాయి నుంచే కాంగ్రెస్ పటిష్టత
త్వరలో మండల, వార్డు కమిటీలు
డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
హనుమకొండ డీసీసీ కార్యాలయంలో పీఏసీ తొలి సమావేశం
జిల్లా కమిటీల నియామకంపై నిర్ణయం
కాకతీయ, హనుమకొండ: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు రాజకీయ వ్యవహారాల కమిటీ తన కార్యాచరణను ప్రారంభించింది. మంగళవారం హనుమకొండ డీసీసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అధ్యక్షతన పీఏసీ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
త్వరలో మండల, వార్డు కమిటీలు..
జిల్లా, మండల కమిటీల నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలని సమావేశం నిర్ణయించింది. గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసేందుకు వీలుగా పంచాయతీ, వార్డు కమిటీల ఏర్పాటును వేగవంతం చేయాలని నేతలు దిశానిర్దేశం చేశారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బీఎల్ఏ-2 (బూత్ లెవల్ ఏజెంట్) నియామక ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా యూఎస్డీఎల్ అంశాలపై రైతులకు అండగా ఉండాలని పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వం చేపట్టిన పాఠశాల అల్పాహార పథకం, మధ్యాహ్న భోజన పథకాలను ఈ సందర్భంగా నేతలు అభినందించారు. గిగ్ వర్కర్ల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టాన్ని సమావేశం ఏకగ్రీవంగా స్వాగతించింది. ఇదే క్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి అవసరమైన భూమి కేటాయింపు అంశంపైనా నేతలు సుదీర్ఘంగా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాలని పిలుపునిచ్చారు.

