పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
99 రోజుల కార్యాచరణతో ప్రజలకు చేరువగా పాలన
త్వరలో 2 లక్షల కొత్త పెన్షన్ల మంజూరు
దేవాదుల కాలువలతో పంటలకు జలకళ
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
కాకతీయ, స్టేషన్ ఘన్పూర్: రాష్ట్రంలోని రైతు, మహిళా, పేద వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం సిరిపురం గార్డెన్స్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని వివరించారు.
రూ.350 కోట్లతో దేవాదుల పనులు..
నియోజకవర్గంలో రూ.350 కోట్లతో దేవాదుల కాలువల పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, గోదావరి జలాలు అందుతుండటంతో పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయని కడియం తెలిపారు. రైతుల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదల కోసం ఇందిరా కుటుంబ భీమా వంటి పథకాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అందుతున్నాయని చెప్పారు. వీటికి అదనంగా రాష్ట్రవ్యాప్తంగా మరో 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
అభివృద్ధి పథంలో నియోజకవర్గం..
నియోజకవర్గంలో ఆసుపత్రి భవనం, సమీకృత కార్యాలయ సముదాయం, రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని కడియం వివరించారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు వెచ్చిస్తున్నామని, సర్పంచులు, కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా పనిచేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రైతులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

