బంగారం కొంటామని వచ్చి కాల్పులు
దుండగులను అడ్డుకున్న సిబ్బంది ధైర్యం ప్రశంసనీయం
క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలింపు
పీఎంజే జ్యువెలరీ షాపును సందర్శించిన కేంద్ర మంత్రి
కాకతీయ, కరీంనగర్: నగరంలోని జ్యోతినగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో జరిగిన కాల్పుల ఘటన అత్యంత దురదృష్టకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం దోపిడీ జరిగిన వెంటనే ఆయన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్తో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, అసలేం జరిగిందనే అంశంపై షాపు సిబ్బందిని, పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. “బంగారం కొనుగోలు చేస్తామంటూ వినియోగదారుల ముసుగులో ఐదుగురు దుండగులు షాపులోకి చొరబడ్డారు. తొలుత ఒకరు వచ్చి 20 గ్రాముల చైన్ కావాలన్నారని, ఆ తర్వాత మరో ఇద్దరు లోపలికి వచ్చి ఆభరణాలు చూపాలని కోరారని తెలిసింది. ఆభరణాలు చూపిస్తున్న సమయంలో మరో ఇద్దరు వచ్చి తుపాకులతో బెదిరించారు. దుండగులు తెలుగు, హిందీ భాషల్లో మాట్లాడుకున్నట్లు సమాచారం. అడ్డుకున్న సేల్స్ మేనేజర్, ఇతర సిబ్బందిపై కాల్పులు జరిపారు. సిబ్బంది అత్యంత ధైర్యసాహసాలతో వారిని ప్రతిఘటించడం వల్లే దొంగలు ఒక బ్యాగును అక్కడే జారవిడిచి వెళ్లారు” అని వివరించారు.

నగరాన్ని చుట్టుముట్టిన పోలీసులు..
ఘటన జరిగిన పది నిమిషాల ముందే తాను సమీపంలోనే అభివృద్ధి పనుల శంకుస్థాపనలో పాల్గొన్నట్లు మంత్రి తెలిపారు. “ఘటన తెలిసిన వెంటనే పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో బలగాలు అప్రమత్తమయ్యాయి. నగరాన్ని జల్లెడ పడుతున్నాయి. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. దుండగులను పోలీసులు కచ్చితంగా పట్టుకుంటారనే నమ్మకం ఉంది” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బాధితులకు మెరుగైన వైద్యం..
కాల్పుల్లో గాయపడిన సిబ్బందికి ప్రస్తుతం ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. అయినప్పటికీ, వారికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఎంత మేర బంగారం చోరీకి గురైందనేది పోలీసుల పూర్తిస్థాయి విచారణలో తేలుతుందని ఆయన అన్నారు.

