రాబందుల రాజ్యం పోయి రైతుబంధు రాజ్యం రావాలి…
*మీటింగులు,మేళాల పై ఉన్న సోయి రైతులపై లేదు..
*ఎద్దు ఏడ్చిన వ్యవసాయం,రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు..
*కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం సిగ్గుచేటు…
*రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాల్సిందే.. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం..
*ఊకల్ సొసైటీ కొనుగోలు కేంద్రంలో మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
కాకతీయ,గీసుగొండ:రాబందుల రాజ్యం పోయి రైతుబంధు రాజ్యం రావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మంగళవారం మండలంలోని ఊకల్ సొసైటీ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పడుతున్న ఇబ్బందులపై రైతులు కేటీఆర్కు వివరించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మక్క రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. “దించేటోళ్లు లేరు, జోకేటోళ్లు లేరు, కొనేటోళ్లు లేరు” అంటూ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులు పండించిన పంటకు సరైన ధర దక్కే పరిస్థితి లేదని, కనీసం పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు.రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో మక్కలు పండుతున్నప్పటికీ సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో గీసుగొండ మండలంలో 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం కేవలం రెండు కేంద్రాలకే పరిమితం చేశారని తెలిపారు. రైతులు 20 రోజుల క్రితమే మక్కలు తీసుకొచ్చినా ఇప్పటికీ కాంటాలు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.వర్షాలు పడే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం టార్పాలిన్లు కూడా అందుబాటులో ఉంచలేదని మండిపడ్డారు. ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నా ప్రభుత్వం కేవలం 26 క్వింటాళ్లకే పరిమితం చేస్తోందని, పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తే మద్దతు ధర చెల్లించాల్సి వస్తుందని అందుకే రైతులను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. మక్కలను దళారుల పాలయ్యేలా ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తు న్నామని కేటీఆర్ తెలిపారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గూడెంపాడు వద్ద రైతులతో కలిసి ధర్నా చేస్తే కేసులు పెట్టారని, ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. రైతులు పండించిన వరి,మక్కజొన్న, జొన్న ప్రతి గింజను కొనుగోలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.తాను వరంగల్కు వస్తున్నానని తెలిసి మీటింగులు, మేళాలు పెట్టి రైతులను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మీటింగులు, మేళాలపై చూపుతున్న శ్రద్ధ రైతుల సమస్యలపై చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే నిర్లక్ష్య ధోరణి కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించి రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నిమ్మగడ్డ వెంకన్న,చింతం సదానందం,మాజీ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, నాయకులు బోడకుంట్ల ప్రకాష్,చల్ల వేణుగోపాల్ రెడ్డి, గోలి రాజయ్య, గుర్రం రఘు, ముంత రాజయ్య,అంకతి నాగేశ్వర రావు,ధనంజయ్, భీమా రావు,యువ నాయకులు శిరిసే శ్రీకాంత్, కోట ప్రమోద్, మంద రాజేందర్,సల్ల రాజు, నాగరాజు, అభిషేక్,అజార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

