అభివృద్ధి మాది.. ఆర్భాటం మీదా?
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని మీదని చెప్పుకోవడం సిగ్గుచేటు
ఖమ్మం కార్పొరేషన్లో కాంగ్రెస్వి ‘కాకి లెక్కలే’
రూ.4వేల కోట్ల ప్రచారం అంతా పచ్చి అబద్ధం
మేం తెచ్చిన నిధులను మీ ఖాతాలో వేసుకుంటారా?
కాంగ్రెస్ పాలకవర్గంపై బీఆర్ఎస్ కార్పొరేటర్ల ధ్వజం
వారసత్వ సంపదపై కాంగ్రెస్ ముద్ర అంటూ విమర్శలు
కాకతీయ,ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరపాలక సంస్థలో గత ఐదేళ్లుగా జరిగిన అభివృద్ధిపై అధికార, ప్రతిపక్షాల మధ్య ‘మాటల’ యుద్ధం తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ పాలకవర్గం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, ‘కాకి లెక్కలతో’ కాలం గడుపుతూ అబద్ధపు ప్రచారాలు చేస్తోందని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిప్పులు చెరిగారు. గురువారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పగడాల నాగరాజు,కర్నాటి కృష్ణ,మక్బూల్ ,శీలంశెట్టి వీరభద్రం,తోట రామారావు,నాగాండ్ల కోటి,బిక్కసాని ప్రశాంతలక్ష్మిలు మాట్లాడుతూ 6 తేదీన మేయర్ నిర్వహించిన పత్రికా సమావేశాన్ని తీవ్రంగా ఖండించారు. నగరాన్ని రూ. 4వేల కోట్లతో అభివృద్ధి చేశామన్న మాజీ మేయర్ నీరజ ప్రకటనను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన ఈ రెండేళ్లలో నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమని కార్పొరేటర్లు విమర్శించారు. “కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మారింది ఒక్కటే.. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న మేయర్, కార్పొరేటర్ల రాజకీయ రంగులు మాత్రమే” అని ఎద్దేవా చేశారు. దశాబ్దాల కాలం ఖమ్మాన్ని మురికికూపంలా వదిలేసిన కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషితోనే నగరం నేడు సీతాకోకచిలుకలా మెరుస్తోందని, 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని తాము ఆరేళ్లలో చేసి చూపించామని స్పష్టం చేశారు.
వారసత్వ సంపదపై కాంగ్రెస్ ముద్ర
నగరంలో ప్రస్తుతం కనిపిస్తున్న ప్రతి అభివృద్ధి పని బీఆర్ఎస్ హయాంలో పునాది పడిందేనని నేతలు గుర్తుచేశారు. నూతన బస్టాండ్, కలెక్టరేట్, కార్పొరేషన్ కార్యాలయం, లకారం ట్యాంక్బండ్ సుందరీకరణ, వైకుంఠధామాలు, బస్తీ దవాఖానాలు వంటివన్నీ తమ ప్రభుత్వ ఘనతేనని వివరించారు. మున్నేరు వరద బాధితుల కష్టాలు చూసి అజయ్ కుమార్ రూ. 180 కోట్లతో తీగల వంతెనను, రూ. 800 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని మంజూరు చేయించారని.. ఆ పనులను ఇప్పుడు కాంగ్రెస్ నేతలు తమవిగా చెప్పుకోవడం ‘మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ’ అని చెప్పుకోవడమేనని మండిపడ్డారు.
బడుగుల సంక్షేమానికి పాతర
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు, బలహీన వర్గాల పట్ల వివక్ష చూపుతోందని కార్పొరేటర్లు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో మైనారిటీల కోసం షాదీఖానాకు స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులను నిలిపివేసిందని ధ్వజమెత్తారు. అదేవిధంగా బీసీ భవన్ నిర్మాణ పనులను కూడా అడ్డుకున్నారని, ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ, మక్బూల్, శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, నాగాండ్ల కోటి, బిక్కసాని ప్రశాంతలక్ష్మి, బుడిగం శ్రీను, బుర్రి వెంకట్, కూరాకుల బాలరాజు, దండా జ్యోతి రెడ్డి, పసుమర్తి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

