రైతు కంట్లో కారం
ఖమ్మంలో ఆగని మిర్చి ‘జీరో’ దందా
నిలువునా మునుగుతున్న రైతులు
మార్కెట్ సెలవులను ఆసరాగా చేసుకుంటున్న అక్రమమార్కులు
ప్రకాష్ నగర్ బ్రిడ్జి పక్కన అక్రమ వ్యాపారం
వ్యాపారులతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్న మార్కెట్ అధికారి
జెండా పాట రూ.20600 ఉంటే.. ప్రైవేటుగా రూ.14000 లోపే కొనుగోళ్లు
క్వింటాల్కు రూ.2000 నుంచి రూ.3000 వరకు దోపిడీ
ఖమ్మం కలెక్టర్ దివాకర ఆదేశాలు బేఖాతరు
అక్రమ సిండికేట్పై చర్యలు శూన్యం..
లైసెన్సులు రద్దు చేయాలని రైతు సంఘాల డిమాండ్

కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు అధికారికంగా సెలవులు ప్రకటించడాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమ వ్యాపారులు సిండికేట్గా మారి మిర్చి ‘జీరో’ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. మార్కెట్ యార్డు పరిసరాల్లో కాకుండా ఈసారి ఏకంగా ప్రకాష్ నగర్ బ్రిడ్జి పక్కన ఉన్న కాళ్ళ రామారావు మామిడి తోటను అక్రమ వ్యాపారానికి వేదికగా మార్చుకున్నారు. ఈ నెల 18 న ‘కాకతీయ’ పత్రికలో సెలవు రోజుల్లో జరుగుతున్న అక్రమ మిర్చి వ్యాపారంపై ప్రత్యేక కథనం ప్రచురితమైన సంగతి విదితమే. దీనిపై అప్పట్లో స్పందించిన మార్కెట్ సెక్రటరీ.. అక్రమ వ్యాపారానికి పాల్పడితే సదరు వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసి బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదు. నిబంధనలను తుంగలో తొక్కి ప్రతిరోజూ తెల్లవారుజామున 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు వందలాది బస్తాల మిర్చిని అక్రమంగా కొనుగోలు చేస్తూ పన్నులు ఎగ్గొట్టడంతో పాటు రైతులను నిలువునా ముంచుతున్నారు.

అధికారుల అండదండలు.. చీకటి ఒప్పందాలు
ఈ అక్రమ వ్యాపారం ఇంత పెద్ద ఎత్తున, బహిరంగంగా సాగడానికి మార్కెట్ ఉన్నతాధికారి ఒకరు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు అధికారి స్వయంగా తన సొంత కారులో క్షేత్రస్థాయికి వెళ్లి, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ ఎల్ఎంఆర్ వ్యాపారితో పాటు స్థానిక వ్యాపారి పత్తి పాక రమేష్లతో కలిసి చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం లభించింది. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో వ్యాపారులు ఎలాంటి భయం లేకుండా టాటా ఏసీ, బొలెరో వాహనాల ద్వారా గ్రామాల్లోని రైతుల నుండి వందలాది మిరప బస్తాలను ఇక్కడికి తరలిస్తున్నారు. కొంతమంది కమిషన్ దారులు సైతం లంచాలకు ఆశపడి తమ పరిధిలోని అమాయక రైతులను పిలిపించి, వారి పంటను తక్కువ ధరకే అమ్ముకునేలా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

క్వింటాలుకు రూ.3000 వరకు దోపిడీ
సాధారణంగా మార్కెట్ యార్డులో జెండా పాట ప్రకారం పారదర్శకంగా కొనుగోళ్లు జరిగితే రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుంది. కానీ, ఈ ప్రైవేట్ అక్రమ మార్కెట్లో రైతు అవసరాలను వ్యాపారులు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. మార్కెట్ సెలవులకు ముందు క్వింటా మిర్చి జెండా పాట రూ.20600 పలికిన రకాలను, ఇక్కడ కేవలం రూ.14000 నుండి రూ.15000 లోపే కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రైతుకు గత్యంతరం లేక తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మార్కెట్ సెలవు రోజుల్లో ఇలా దొంగచాటుగా వ్యాపారం చేయడం వల్ల క్వింటాలుకు కనీసం రూ.2000 నుండి రూ.3000 వరకు రైతులకు నష్టం వాటిల్లుతోందని తోటి వ్యాపారులే విమర్శిస్తున్నారు. మార్కెట్కు రావాల్సిన ఫీజు ఆదాయానికి గండి కొడుతూ, నిరుపేద రైతులను దోచుకుంటున్న ఈ సిండికేట్పై జిల్లా కలెక్టర్ కఠిన ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు వాటిని బేఖాతరు చేయడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ తోటల వ్యాపారాన్ని అరికట్టి, బాధ్యులైన వారి లైసెన్సులు రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

