ధాన్యం కుప్పల మీదే కుప్పకూలుతున్న రైతన్నలు!
రాష్ట్రంలో కుప్పకూలిన ప్రభుత్వ వ్యవస్థలు
రైతులు గుండెపగిలి రాలిపోతున్నా చలనం లేని రాక్షస పాలన!
మండుటెండల్లో కొనుగోలు కేంద్రాల కాడ అన్నదాతల ఆకస్మిక మరణాలు
పంటలు కొనకుండా రైతాంగాన్ని ఇంకెంత కాలం యాతన పెడతారు?
దున్నపోతు మీద వానపడ్డట్టు ప్రవర్తించడం మానుకోవాలి
సోషల్ మీడియా వేదికగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : “రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్దకు తెచ్చిన రైతులు.. అక్కడ ప్రభుత్వ ఉదాసీనత వల్లే ధాన్యం కుప్పల మీదే గుండెపగిలి కుప్పకూలిపోతున్నారు” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయని, రైతులు ప్రాణాలు కోల్పోతున్నా కనీస చలనం లేని రాక్షస పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రిమండలి ధాన్యం కొనుగోళ్లపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. దమ్ముంటే అసలు గణాంకాలతో కూడిన ‘శ్వేతపత్రం’ విడుదల చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
80 శాతం కొనుగోళ్లు ఎక్కడయ్యాయి? నిరూపిస్తే శిక్షకు సిద్ధం!
తెలంగాణ భవన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియకుండా 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని కాగితాల్లో లెక్కలు చెప్తున్నారని మండిపడ్డారు. “ముఖ్యమంత్రి చెప్తున్న దాంట్లో ఒక్క శాతం కూడా నిజం లేదు. గ్రౌండ్ రిపోర్టుల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 30 నుంచి 35 శాతానికి మించి ధాన్యం కొనుగోళ్లు జరగలేదు. ముఖ్యమంత్రి గారు తన వాదనను నిరూపిస్తే నేను ఎలాంటి శిక్షకైనా, బహిరంగ క్షమాపణకైనా సిద్ధం. ఒకవైపు సీఎం 80 శాతం అంటే, సివిల్ సప్లైస్ మంత్రి 50 శాతం అంటారు.. అసలు మీ ప్రభుత్వంలో ఒకరికి ఒకరికి ఏమైనా సమన్వయం ఉందా?” అని కేటీఆర్ నిలదీశారు. కొనుగోలు కేంద్రాల కాడ మండుటెండల్లో నిరీక్షిస్తూ అన్నదాతల గుండెలు ఆగిపోతున్నా.. ఈ కర్కశ ప్రభుత్వానికి కనికరం కలగడం లేదని, అన్నదాతల చావులను చూసి ముఖ్యమంత్రి ఆనందిస్తున్నారా? అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
గన్ సంచులు లేవు.. దాలీ పేరిట దోపిడీ!
గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నాయకత్వంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా నెలల ముందే ప్రణాళికలు రచించి, రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ చేతకానితనం వల్ల రైతులు గన్ సంచులు (గోనె సంచులు), జూట్ తాడు కోసం కూడా అల్లాడాల్సి వస్తోందని, ఒక్కో సంచిని రైతులు సొంత డబ్బులతో రూ.25 నుంచి రూ.35 పోసి కొనుక్కోవాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. దీనికి తోడు మిల్లింగ్ అడ్డంకులు, క్వింటాలుకు 6 నుంచి 8 కిలోల తరుగు (దాలీ) పేరిట రైతులను దళారులు నిలువునా దోచుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తన కుర్చీని కాపాడుకోవడానికి ఢిల్లీ చుట్టూ 70 సార్లు తిరిగే సోయి ఉంది కానీ.. కల్లాళ్లో నకనకలాడుతున్న రైతును చూడటానికి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని దౌలతాబాద్కు వెళ్లే తీరిక లేదా? అని దుయ్యబట్టారు.
కేబినెట్ భేటీలోనైనా కళ్లు తెరవండి..
నకిలీ నిబంధనలు పక్కనబెట్టి వర్షాలకు తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా తక్షణమే ఎంటువంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. “ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షిస్తూ గుండె ఆగి, ఎండదెబ్బతో చనిపోయిన నల్గొండకు చెందిన నాసిరుద్దీన్, మంచిర్యాల, వరంగల్, మెదక్ జిల్లాలకు చెందిన 10 మందికి పైగా రైతు కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా (నష్టపరిహారం) చెల్లించాలి. ఇవాళ జరగబోయే కేబినెట్ భేటీలోనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారాన్ని వీడి, సోయి తెచ్చుకుని ధాన్యం కొనుగోళ్లపై పూర్తి చిత్తశుద్ధితో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతుల తిప్పలు తప్పించి, పంట కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే కల్లాలనే వేదికలుగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో రైతుల పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.

