ఫేక్ ఉద్యమకారులపై నిఘా ఉంచాలి
నకిలీ ఎఫ్ఐఆర్లు, ఏఐతో లబ్ధి పొందేందుకు కుట్ర
డీసీఆర్బీ డేటా ఆధారంగా గుర్తించాలి
జూన్ 2లోపు ప్రక్రియను పూర్తి చేయాలి
ఉద్యమకారుల సంక్షేమానికి కేకే కమిటీ కృషి చేయాలి
ప్రొఫెసర్ కోదండరాంకు విద్యాశాఖ ఇవ్వాలి
ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పొనుగోటి సంపత్
కాకతీయ, కొత్తగూడెం : తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే (కె. కేశవరావు) కమిటీని స్వాగతిస్తున్నామని, అయితే అర్హులైన నిక్కార్సైన ఉద్యమకారులకే న్యాయం జరిగేలా కమిటీ తన విధివిధానాల్లో కొన్ని మార్పులు చేసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పొనుగోటి సంపత్ డిమాండ్ చేశారు. స్థానిక కొత్తగూడెంలోని విద్యానగర్లో గల ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు ‘నవతన్’ అధ్యక్షతన తొలి దశ, మలి దశ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యమకారుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పొనుగోటి సంపత్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్న తరుణంలో ఉద్యమకారుల కోసం కమిటీ వేయడం హర్షణీయమన్నారు. గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన 1,250 మంది అమరవీరుల కుటుంబాలలో.. ఇప్పటికే లబ్ధి పొందిన 750 కుటుంబాలు పోను, మిగిలిన 500 కుటుంబాలను మొదటి ప్రాధాన్యతగా (ఫస్ట్ ప్రయారిటీ) తీసుకొని ఆదుకోవాలన్నారు. రెండో ప్రాధాన్యతగా ఉద్యమ సమయంలో జైలు జీవితం గడిపి, కేసులు, ఎఫ్ఐఆర్లు, రౌడీషీట్లు, పీడీ యాక్ట్లు ఎదుర్కొని ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారిని గుర్తించి న్యాయం చేయాలన్నారు. గత పదేళ్లలో ఇప్పటికే రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందిన వారిని నాల్గవ ప్రాధాన్యత కిందికి మార్చాలని సూచించారు.
ఏఐ టెక్నాలజీతో నకిలీ ఎఫ్ఐఆర్ల సృష్టి..
ప్రస్తుతం ఉద్యమకారుల సంక్షేమం పేరుతో ఉద్యమానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు కొత్త సంఘాలు పెట్టుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని సంపత్ ఆరోపించారు. ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ.. పాత ఎఫ్ఐఆర్ కాపీలలో ఇతరుల పేర్లు లేదా ‘అప్స్కాండ్’ అని ఉన్న స్థానాల్లో తమ పేర్లు వచ్చేలా నకిలీ రికార్డులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి నకిలీ ఉద్యమకారులను కేకే కమిటీ గుర్తించడం కష్టతరం కాబట్టి.. ఆనాటి సమైక్యాంధ్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ , టాస్క్ ఫోర్స్ విభాగాల నివేదికలను తెప్పించుకోవాలని కోరారు. జిల్లా క్రైమ్ రికార్డ్ బోర్డు లో భద్రపరిచిన నివేదికల ఆధారంగానే అసలైన ఉద్యమకారులను వడపోత పట్టి గుర్తించాలన్నారు. జూన్ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి కేకే కమిటీ తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించి, ఆ రోజున ఉద్యమకారులను అధికారికంగా గౌరవించేలా కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు.
ప్రొఫెసర్ కోదండరాంకు విద్యాశాఖ ఇవ్వాలి
మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని జేఏసీ చైర్మన్గా ముందుండి నడిపిన ప్రొఫెసర్ కోదండరాంను రాబోయే క్యాబినెట్ విస్తరణలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నియమించాలని పొనుగోటి సంపత్ ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమంతో సంబంధం లేని, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా వెళ్లి అక్కడి విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించిన ఒక మాజీ ఐఏఎస్ అధికారిని ఇక్కడ విద్యా కమిషన్ చైర్మన్గా నియమించడం వల్లే తెలంగాణ మేధావులు విస్మయానికి గురయ్యారన్నారు. ఆయన క్షేత్రస్థాయి పరిశీలనలు చేయకుండా, ఎలాంటి నివేదికలు ఇవ్వకుండా హఠాత్తుగా రాజీనామా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పరిధిలో ఉన్న విద్యాశాఖను ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాంకు అప్పగిస్తే.. ఇక్కడి విద్యా విధానంపై పూర్తి అవగాహన ఉన్న ఆయన నేతృత్వంలో విద్యా వ్యవస్థ మరింత మెరుగవుతుందని, జాతీయ స్థాయిలో తెలంగాణ విద్యా విధానం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తొలిదశ, మలిదశ ఉద్యమకారులు గూడెల్లి యాకయ్య, తెలంగాణ సురేష్, సాంబా పూర్ణ, తెలంగాణ క్రాంతి, కలకోటి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

