సీతక్క ప్రెస్మీట్ బహిష్కరణ
నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టుల నిరసన
కాంగ్రెస్ నేతల బెదిరింపులపై రోడ్డెక్కిన జర్నలిస్టులు
కాకతీయ, ఏటూరునాగారం: మైనర్ బాలికపై జరుగుతున్న అసత్య ప్రచారంపై రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయగా, మరోవైపు కాంగ్రెస్ నేతల బెదిరింపులకు నిరసనగా ఏటూరునాగారం జర్నలిస్టులు ఆమె మీడియా సమావేశాన్ని బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో రోడ్డెక్కారు. గురువారం కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. ఒక 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం, గర్భం అంటూ అసత్య ప్రచారం చేయడం దారుణమని మంత్రి మండిపడ్డారు. సదరు బాలికకు గర్భం లేదని వైద్య పరీక్షల్లో తేలినా ఇంకా విష ప్రచారం కొనసాగించడం సరికాదన్నారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, లేనిపక్షంలో చట్టపరమైన కేసులు ఖాయమని హెచ్చరించారు.
జర్నలిస్టుల ఇళ్ల ముట్టడికి యత్నం..
మంత్రి ప్రెస్మీట్ జరుగుతున్న సమయంలోనే.. స్థానిక కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలకు నిరసనగా ఏటూరునాగారం ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్డుపై నిరసన తెలిపారు. వార్తలు రాసిన జర్నలిస్టుల ఇళ్లను ముట్టడిస్తామని, దాడులు చేస్తామని కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మంత్రి సీతక్క మీడియా సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఒకవైపు మంత్రి మీడియాపై విమర్శలు చేయడం, మరోవైపు కాంగ్రెస్ నేతల తీరుపై జర్నలిస్టులు నిరసనకు దిగడం ఏటూరునాగారంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

