పొగాకు వినియోగం ఆరోగ్యానికి తీవ్ర ముప్పు!
దేశంలో పొగాకు వాడకం వల్ల ఏటా లక్షలాది మంది మృతి
హన్మకొండ డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హనుమకొండలో అవగాహన ర్యాలీ
కాకతీయ, హనుమకొండ : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన సదస్సు, పోస్టర్ల ప్రదర్శన మరియు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ ఏ. అప్పయ్య మాట్లాడుతూ.. ధూమపానం మరియు పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలను చైతన్యపరిచారు. సిగరెట్లు, బీడీలు తాగడం వల్ల వాటిని కాల్చేవారికే కాకుండా, ఆ పొగ పీల్చే పక్కనున్న వారి ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. పార్కులు, బస్టాండ్లు, సినిమా హాళ్లు, మార్కెట్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం చట్టప్రకారం నేరమని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నామని చెప్పారు. నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసుల సహకారంతో ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నామని, పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో 100 గజాల పరిధిలో పొగాకు అమ్మకాలను నిరోధించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎంజీఎం ఆసుపత్రిలో క్యాన్సర్ బాధితుల కోసం ప్రత్యేక వైద్య కేంద్రం అందుబాటులో ఉందని తెలిపారు.
పొగాకు వినియోగంలో దేశం రెండో స్థానం..
శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రామక శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే పొగాకు వినియోగంలో భారతదేశం రెండో స్థానంలో ఉండడం ఆందోళనకరమని, ప్రతి ఏడాది లక్షలాది మంది పొగాకు సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మహమ్మారిని అరికట్టడానికి ప్రజల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతైనా అవసరమని అన్నారు. ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు (పల్మనాలజిస్ట్) డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. ధూమపానం వల్ల ఊపిరితిత్తులతో పాటు గుండె, లివర్ ఇలా శరీరంలోని దాదాపు అన్ని ప్రధాన అవయవాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. యువత ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీనివాస్, పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. రాజిరెడ్డి, హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ డీ-అడిక్షన్ సెంటర్ నిర్వాహకులు రాము, జిల్లా మాస్ మీడియా అధికారి వి. అశోక్ రెడ్డి, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వాకర్స్ మరియు వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

