సింగరేణి ఆసుపత్రిని యథావిధిగా నడిపించాలి
కొత్త వైద్యులు, సిబ్బందిని నియమించాలి
తక్షణమే డిస్పెన్సరీని పునరుద్ధరించాలి
ఆస్పత్రి సీఎంఓకు ఏఐటీయూసీ వినతిపత్రం
సానుకూలంగా స్పందించిన సీఎంఓ
త్వరలోనే డాక్టర్, స్టాఫ్ను నియమిస్తామని హామీ
కాకతీయ, కొత్తగూడెం : భద్రతా కారణాలు, సిబ్బంది కొరత నెపంతో రామవరం సింగరేణి డిస్పెన్సరీని (ప్రాథమిక వైద్యశాల) మూసివేయాలనే ఆలోచనను యాజమాన్యం తక్షణమే విరమించుకోవాలని, మూసేసిన ఆసుపత్రిని తెరిచి యథావిధిగా పునరుద్ధరించాలని గుర్తింపు సంఘం ‘సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్’ (ఏఐటీయూసీ) నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సింగరేణి ప్రధాన వైద్యశాల ముఖ్య వైద్యాధికారి (సిఎంఓ) కిరణ్ రాజ్ను ఏఐటీయూసీ ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందజేసింది.
ఒక్కరు రిటైర్ అయితే ఆసుపత్రికే సీల్ వేస్తారా?
ఈ సందర్భంగా ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ మాట్లాడుతూ.. రామవరం ప్రాంతంలో నివసిస్తున్న వందలాది మంది సింగరేణి కార్మికులు, విశ్రాంత (మాజీ) కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు ఈ ప్రాథమిక వైద్యశాల ఎంతో కాలంగా కొండంత అండగా ఉంటూ వైద్య సేవలు అందిస్తోందన్నారు. ఇక్కడ పనిచేసే ఒక ఉద్యోగి పదవీ విరమణ పొందడంతో, ఆ స్థానంలో కొత్తవారిని నియమించాల్సింది పోయి.. డిస్పెన్సరీకి ఏకంగా తాళాలు వేసి సీల్ చేయడం ఎంతవరకు సమంజసమని యాజమాన్యాన్ని నిలదీశారు.
కార్మికులకు ఆర్థిక, శారీరక శ్రమ..
ఈ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రిని మూసివేయడం వల్ల స్థానిక కార్మిక కుటుంబాలు చిన్నపాటి జ్వరం, జలుబు వంటి వైద్య సేవలకు మరియు మందుల కోసం సైతం సుదూర ప్రాంతంలో ఉన్న ప్రధాన వైద్యశాలకు వెళ్లాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వారికి ఆర్థికంగా, శారీరకంగా తీవ్ర భారంగా మారుతోందని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి కొత్త వైద్యులను, అవసరమైన సిబ్బందిని నియమించి రామవరం డిస్పెన్సరీని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) పరిధిలోనే ఈ ప్రాంతం ఉంది కాబట్టి, పాతబడిన డిస్పెన్సరీ భవనానికి తగిన మరమ్మతులు చేయించి పునర్నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వైద్యాధికారి సానుకూల హామీ..
కార్మిక సంఘం నేతల వినతిపై ముఖ్య వైద్యాధికారి (సిఎంఓ) కిరణ్ రాజ్ సానుకూలంగా స్పందించారు. రామవరం డిస్పెన్సరీ భవన సమస్యను త్వరితగతిన పరిష్కరించి, అక్కడ త్వరలోనే కొత్త డాక్టర్ను, అవసరమైన వైద్య సిబ్బందిని నియమించి ఆసుపత్రిని పునరుద్ధరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.వి. రమణమూర్తి, సహాయ కార్యదర్శులు గట్టయ్య, రాము, వైస్ ప్రెసిడెంట్ కత్తెర్ల రాములు, పిట్ కార్యదర్శులు అనంతలక్ష్మి, మధు కృష్ణ, కమల్, కార్యాలయ ప్రతినిధులు నాగయ్య, కర్రు రమేష్, సీనియర్ నాయకులు మర్రి గోపి, లక్ష్మీనారాయణ, మండల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

