మెడికల్ ఫిట్ వారసులకు నియామక పత్రాలివ్వాలి
నెలల తరబడి ఎదురుచూస్తున్నా యాజమాన్యానికి పట్టింపులేదు
సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం
ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్
సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ధర్నా
జనరల్ మేనేజర్ షాలెం రాజుకు వినతిపత్రం అందజేత
కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి సంస్థలో ఉద్యోగాలు పొందాలనే ఆశతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారసులు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఉద్యోగంలో ఉన్న సమయంలో అనారోగ్యం ప్రమాదాల వల్ల కార్మికులు సేవలను కోల్పోయినప్పుడు వారి కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో డిపెండెంట్ ఉద్యోగ విధానం వచ్చిందని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వి మల్లికార్జున్ రావు తెలిపారు. మెడికల్ పరీక్షల్లో అర్హత సాధించి అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకున్నప్పటికీ వందలాది మంది వారసులు నెలల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ పిల్లల చదువులు వైద్య ఖర్చులు భరించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
కార్మిక కుటుంబాల నిర్లక్ష్యం తగదు
సింగరేణి సంస్థ లాభాల సాధనలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని అలాంటి కార్మికుల కుటుంబాలను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. మెడికల్ ఫిట్ అయిన ప్రతి వారసుడికి ఆలస్యం లేకుండా నియామక పత్రాలు అందజేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో మరింత ఉధృతమైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం నాయకులు జనరల్ మేనేజర్ షాలెం రాజుకు వినతిపత్రం అందజేశారు.
జీఎం సానుకూల స్పందన
మెడికల్ ఫిట్ డిపెండెంట్ల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తానని జనరల్ మేనేజర్ షాలెం రాజు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, వైస్ ప్రెసిడెంట్ కత్తెర్ల రాములు, ఆఫీస్ బేరర్లు సందబోయిన శ్రీనివాస్, హుమాయూన్, పిట్ కార్యదర్శులు భూక్యా రమేష్, కమల్, సౌజన్య, సీనియర్ నాయకులు మండల రాజేశ్వరరావు, సురేందర్, మాచర్ల శ్రీనివాస్, కొవ్వూరి రాజేశ్వరరావు, బండారి మల్లయ్య, అప్పారావు, శశివర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.

