భూముల మార్కెట్ విలువల సవరణ
ఈ నెల 5వ తేదీ నుంచి అమలు
క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా కొత్త విలువల నిర్ణయం
గత ప్రభుత్వం అశాస్త్రీయంగా ధరలను పెంచింది
అధిక ధరలు ఉన్న ప్రాంతాల్లో పెంపు లేదు
నిర్మాణ వ్యయాల రేట్లను కూడా సవరించాం
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో భూముల విలువలను శాస్త్రీయంగా, హేతుబద్ధంగా సవరించామని, ఈ సవరించిన కొత్త విలువలు ఈ నెల 5వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. బుధవారం హైదరాబాద్లో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఆర్థిక నిపుణుల నివేదిక, ఉన్నతాధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకుని విస్తృత అధ్యయనం తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సమగ్ర కసరత్తు లేకుండా, అశాస్త్రీయ పద్దతుల్లో 2021-22 సంవత్సరాల్లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రెండు సార్లు భూముల ధరలను పెంచిందని మంత్రి విమర్శించారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచిందన్నారు. క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా శాతం గణనల ఆధారంగా ధరలు పెంచడం వల్ల కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా విలువలు నిర్ణయించబడ్డాయని తెలిపారు.
మార్కెట్ విలువల పునర్విమర్శ
వాస్తవ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువలకు మధ్య భారీ అంతరం ఉండటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు రాష్ట్రంలోని అన్ని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో మార్కెట్ విలువల పునర్విమర్శ చేపట్టామని వెల్లడించారు. ప్రాంతాల అభివృద్ధి సామర్థ్యం, వృద్ధి రేటు, కొత్త రహదారులు, ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్, పారిశ్రామికాభివృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కెట్ విలువలను నిర్ణయించినట్లు చెప్పారు. ఫ్లాట్ల విషయంలో గతంలో ఉన్న అసమానతలను తొలగించి, కొన్ని ప్రాంతాల్లో అన్ని అంతస్తులకు ఒకే రేటు వర్తింపజేస్తూ మార్కెట్ విలువలను హేతుబద్ధీకరించినట్లు మంత్రి వివరించారు. ఇప్పటికే అధిక మార్కెట్ విలువలు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపు ప్రతిపాదించలేదన్నారు. నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వేతనాలు పెరిగిన నేపథ్యంలో నిర్మాణ రేట్ల సవరణ కూడా చేపట్టామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈ సవరణలు చేపట్టినట్లు పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.

