గుప్త నిధుల వదంతులు నమ్మవద్దు..
పుకార్లు పుట్టిస్తే చర్యలు తప్పవు : సీఐ విశ్వేశ్వర్
దూపకుంట చెరువు కట్ట రాతి స్తంభం తొలగింపుపై పోలీసుల విచారణ
కాకతీయ, గీసుగొండ : “దూపకుంట చెరువు కట్ట సమీపంలో పురాతన రాతి స్తంభం తొలగించి గుప్త నిధులు వెలికితీశారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను ప్రజలెవరూ నమ్మవద్దు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం” అని గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ హెచ్చరించారు. దూపకుంట గ్రామానికి వెళ్లే నూతన బీటీ రోడ్డు పక్కన గల పురాతన రాతి స్తంభాన్ని గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీతో తొలగించిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ విశ్వేశ్వర్ తెలియజేస్తూ.. “దూపకుంట చెరువు కట్ట వద్ద పాతి ఉన్న రాతి స్తంభాన్ని ఎవరో తొలగించి పక్కన పడేశారు. అయితే, దాని కింద గుప్త నిధులు ఉన్నాయని, వాటి కోసమే తవ్వకాలు జరిపారంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు పుకార్లు లేపారు. ఈ విషయం మా దృష్టికి రాగానే సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించాం. అక్కడ గుప్త నిధులు ఉన్నట్లు గానీ, వాటి కోసం తవ్వకాలు జరిపినట్లు గానీ ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదు. ఈ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విచారణ అనంతరం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి..
ప్రజలంతా సామాజిక మాధ్యమాల్లో వార్తలను షేర్ చేసేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఐ విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా వదంతులు వ్యాప్తి చేయవద్దన్నారు. ఎక్కడైనా పురాతన కట్టడాల వద్ద అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గానీ, జేసీబీలతో అక్రమ తవ్వకాలు గానీ గమనిస్తే.. తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్కు లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించి సహకరించాలని ఆయన కోరారు.

