ఎదిరలో ఆధ్యాత్మిక వైభవం..
ఘనంగా ‘శ్రీ పగిడిద్దరాజు జాతర’ ప్రారంభం
కాకతీయ, నూగూరు వెంకటాపురం : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిధిలోని ఎదిర గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అత్యంత పురాతనమైన శ్రీ పగిడిద్దరాజు మహా జాతర ఉత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు పరిసర గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో జాతర ప్రాంగణం కోలాహలంగా మారింది. మంగళవారం ప్రారంభమైన ఈ మహా జాతర జూన్ 12 వరకు నాలుగు రోజుల పాటు కన్నుల పండువగా సాగనుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ముఖ్య ఘట్టాల వివరాలను జాతర నిర్వాహకులు వెల్లడించారు.జాతరలో అత్యంత కీలక ఘట్టం బుధవారం ఆవిష్కృతం కానుంది. సాయంత్రం వేళ ‘పుట్టు దేవర’ గ్రామానికి విచ్చేయనుంది. అనంతరం సాయంత్రం 5:00 గంటలకు అత్యంత వైభవంగా ‘ఎదుర్కోలు’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జూన్ 11న సాంప్రదాయబద్ధంగా వేల్పులను పవిత్ర గంగా స్నానానికి తరలించే మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.శుక్రవారం జాతర ముగింపు రోజైన శుక్రవారం నాడు భక్తులు స్వామివారికి తమ మొక్కుబడులను చెల్లించుకోనున్నారు. ఈ రోజు వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు. భక్తులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి, క్రమశిక్షణతో స్వామివారిని దర్శించుకుని శ్రీ పగిడిద్దరాజు స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని జాతర కమిటీ నిర్వాహకులు కోరారు.

