సీఎం డైరెక్షన్లోనే ఇసుక దోపిడీ
మణుగూరులో గోదావరికి గర్భశోకం
సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ముంపు పేరుతో 70 కిలోమీటర్ల మేర విధ్వంసం
మంత్రులు పొంగులేటి, సీతక్క దోపిడీలో భాగస్వాములు
ప్రభుత్వ ఖజనాకు దక్కాల్సిన సొమ్ము నేతల జేబుల్లోకి
మంత్రుల కనుసన్నల్లోనే ఇసుక ర్యాంపుల్లో అరాచకాలు
ఆదివాసీలు ఎన్జీటికి ఫిర్యాదు చేసినా పట్టించుకోరా..?!
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో/ వరంగల్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలోనే సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ముంపు పేరుతో వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హన్మకొండలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇసుక అక్రమ వ్యాపారంలో మంత్రులు పొంగులేటి, సీతక్క భాగస్వాములని అన్నారు. వీరి డైరెక్షన్లోనే 70 కిలోమీటర్ల మేర గోదావరిలో ఇసుకను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతాల పేరుతో జరుగుతున్న ఇసుక తవ్వకాలు ప్రభుత్వ అండదండలతోనే సాగుతున్నాయని కవిత మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక మాఫియా పడగెత్తిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజనాకు చేరాల్సిన ఆదాయాన్ని సైతం మంత్రులు,ముఖ్యమంత్రి కొల్లగొడుతున్నారని అన్నారు. ఏజెన్సీ చట్టాలను, వాల్టా నిబంధనలను తుంగలో తొక్కి, భారీ యంత్రాలతో గోదావరి గర్భాన్ని ఛిద్రం చేస్తున్నారని, దీనివల్ల గోదావరికి గర్భశోకం మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు స్వయంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో కేసులు వేసినా, ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని, వారి ప్రాణప్రదమైన నదిని కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి
ఇసుక దోపిడీపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని, లేని పక్షంలో రైతులు, ప్రజలే రంగంలోకి దిగి దోపిడీ దారులను తరిమికొట్టే పరిస్థితి వస్తుందని కవిత హెచ్చరించారు. ముఖ్యమంత్రి అండదండలు లేనిదే ఇన్ని వేల కోట్ల రూపాయల దందా సాధ్యం కాదని, మంత్రుల కనుసన్నల్లోనే దండుపాళ్యం ముఠా అరాచకాలు సాగుతున్నాయని విమర్శించారు. నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు ప్రభుత్వ ర్యాంపుల ద్వారానే జరగాలని, అప్పుడే ఆ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని కవిత స్పష్టం చేశారు. కానీ మణుగూరు గోదావరి పరిధిలో ప్రభుత్వ నిబంధనలను పక్కనబెట్టి, ప్రైవేట్ వ్యక్తులు మిషన్లతో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో గోదావరి నది ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని, అక్రమ తవ్వకాలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇసుక దోపిడీతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష పాత్రను తమ పార్టీ సమర్థవంతంగా పోషిస్తుందని, ప్రజా క్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కవిత హెచ్చరించారు.
కాకతీయ అక్షర పోరాటం..
మణుగూరు ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న ఇసుక దోపిడీపై.. కాంట్రాక్టర్ శ్రీకర్ చేస్తున్న ఇసుక మాఫియా అరాచకాలపై కాకతీయలో వరుస కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈనేపథ్యంలో టీఆర్ ఎస్ చీఫ్ కవిత చేసిన వ్యాఖ్యలతో కాకతీయ పోరాటానికి ప్రతిపక్షాల మద్దతు లభిస్తుండటం గమనార్హం.

