జల వాటను వదులుకోవద్దు
తుంగభద్రలో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు
కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలి
ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రయోజనాలను కాపాడాలి
కొడంగల్ లిఫ్ట్ ఎన్వోసీ వెనుక ఉన్న మతలబు ఏమిటి?
అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయించాలి
: సీఎం రేవంత్కు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు లేఖ
కాకతీయ,తెలంగాణ బ్యూరో : తుంగభద్ర జలాల్లో తెలంగాణకు ఉన్న చట్టబద్ధమైన హక్కులను పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించుకోవాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు. తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్), తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ఆయకట్టు ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ ఆయన బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బహిరంగ లేఖ రాశారు. సమైక్య పాలనలో కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు జరిగిన నీళ్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని లేఖలో గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా జలాలను మళ్లించి పాలమూరు లాంటి వలసల జిల్లాలను పచ్చని పంటలతో కళకళలాడేలా చేసిందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జల హక్కులను కాపాడటంలో పూర్తిగా విఫలమవుతూ, రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకర విధానాలను అవలంబిస్తోందని దుయ్యబట్టారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తుంగభద్రపై కర్ణాటక చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలోనూ అదే ద్రోహ బుద్ధితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కొడంగల్ లిఫ్ట్ కోసం బేరసారాలు?
“పాలమూరు బిడ్డనని చెప్పుకునే మీరు, అదే జిల్లా రైతాంగం భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసం?” అని హరీశ్రావు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కర్ణాటక నుంచి నిరాక్షేపణ పత్రం (ఎన్వోసీ) తెస్తున్నామనే సాకుతో తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చారా అని నిలదీశారు. తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న 2 టీఎంసీల కురిడి, 2.5 టీఎంసీల చిక్కాలపర్వి, 5 టీఎంసీల చిక్కాలమంచి బ్రిడ్జ్-కమ్-బ్యారేజీలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమ్మతి తెలిపిందా అని అడిగారు. 2025 జులై 18న కొడంగల్ లిఫ్ట్కు కర్ణాటక ఎన్వోసీ ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటని, ఏడాది కాలంగా కర్ణాటక అక్రమ నిర్మాణాలపై అభ్యంతరం చెప్పకపోవడం అంటే పరోక్షంగా వాటిని అనుమతించినట్లేనని స్పష్టం చేశారు.
ఆర్డీఎస్ పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదం
రాయచూర్ జిల్లాలో రూ.85 కోట్లతో కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్న కురిడి ఎత్తిపోతల పథకం వల్ల ఆర్డీఎస్కు రావాల్సిన ప్రవాహాలు తీవ్రంగా తగ్గిపోతాయని హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ఇన్టేక్ నిర్మాణాలు 60 శాతం పూర్తికావస్తున్నా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ల అనుమతులు లేకుండా పనులు జరుగుతున్నా కనీసం ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. ఆర్డీఎస్లో కర్ణాటక వాటా 1.2 టీఎంసీలు మాత్రమే అయినప్పటికీ, ప్రస్తుతం సగటున 5 టీఎంసీల నీటిని వాడుకుంటోందని గణాంకాలను లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు రాజోలిబండ ఆనకట్టకు కేవలం 100 మీటర్ల ఎగువన ఈ అక్రమ ప్రాజెక్టులు పూర్తయితే ఆర్డీఎస్ పూర్తిగా నిర్వీర్యమవుతుందన్నారు.
భీమా ప్రాజెక్టును దెబ్బతీశారు
ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం చూపేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించిందని హరీశ్రావు గుర్తుచేశారు. కేసీఆర్ ప్రారంభించిన ఆర్డీఎస్ రెండో దశ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనబెట్టిందని, ఇప్పుడు కర్ణాటక ప్రాజెక్టులను అడ్డుకోకపోతే తుమ్మిళ్ల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే గ్రావిటీ ద్వారా నారాయణపేట, కొడంగల్కు నీళ్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, కమీషన్ల కోసం కొడంగల్ లిఫ్ట్ పేరుతో భీమా ప్రాజెక్టు ఆయకట్టు ప్రయోజనాలను దెబ్బతీశారని మండిపడ్డారు. భీమాకు ఉన్న 16.94 టీఎంసీల కేటాయింపులో 7 టీఎంసీలను కొడంగల్ లిఫ్టుకు మళ్లించి 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే భీమాను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు.
తాగునీటి అవసరాలు దెబ్బతింటాయి..
ఈ అక్రమ ప్రాజెక్టుల వల్ల తుంగభద్ర నుంచి శ్రీశైలానికి వచ్చే ప్రవాహాలు తగ్గి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు తాగునీటి అవసరాలు కూడా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు రైతాంగం తరఫున హరీశ్రావు ప్రభుత్వం ముందు 4 ప్రధాన డిమాండ్లను ఉంచారు. తుంగభద్రపై కర్ణాటక చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలి. సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు అధికారికంగా అభ్యంతరాలు తెలపాలి. తుంగభద్ర జలాల వినియోగంలో బచావత్ ట్రిబ్యునల్ విధించిన నిబంధనలను కర్ణాటక తు.చ తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై సుప్రీం కోర్టులో కేసు వేయాలి. కొడంగల్ లిఫ్ట్ కోసం తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చలేదని ప్రభుత్వం నిరూపించుకోవాలి. అని సూచించారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రతి నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, పాలమూరు రైతాంగం కోసం ఎంతదూరమైనా వెళ్లి కొట్లాడుతామని హరీశ్రావు స్పష్టం చేశారు.

