రైతులను తొక్కుతున్న రేవంత్
ఢిల్లీ మూటల కోసం రేవంత్ కష్టం
రైతులపై రేవంత్ కక్ష సాధింపు చర్యలు
కన్నెపల్లి పంప్ హౌస్లు ఆన్ చేయకుండా ప్రభుత్వ నిర్లక్ష్యం
రైతులకు నీళ్లిస్తే బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే రేవంత్ రెడ్డికి భయం
హమాలీల కష్టాలకు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటుంది
హమాలీల ఆదాయం 250% పెంచిన ఘనత కేసీఆర్దే
హమాలీల సమస్యలు తీర్చే బాధ్యత నాది
మళ్లీ కేసీఆర్ రాక..గులాబీ జెండా ఎగరడం ఖాయం
ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ హమాలీ యూనియన్ మహాసభలో కేటీఆర్ వ్యాఖ్యలు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : “వడ్ల బస్తాలు మోసి మీ వీపులు కాయలు కాశాయి.. మీరు కష్టపడుతున్నారు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కష్టపడుతున్నాడు. అయితే ఆయన మోస్తున్నవి వడ్ల సంచులు కావు, ఢిల్లీలోని పెద్దల కోసం డబ్బుల మూటలు!” అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్లో జరిగిన హమాలీ యూనియన్ 18వ ఆవిర్భావ దినోత్సవ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై, రైతులు మరియు హమాలీ కార్మికుల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పంపులు ఆన్ చేస్తే తెలంగాణ సుభిక్షం అవుతుందని తాము చెబుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. కేవలం బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నారని, నీళ్లు ఉండి కూడా పంటలను ఎండబెడుతూ రైతులను అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు. “ఇప్పుడు నీళ్లిస్తే యూరియా ఇవ్వాలి, యూరియా ఇస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే మద్దతు ధర, బోనస్ ఇవ్వాలి. అందుకే ఈ గొడవ అంతా ఎందుకని నీళ్లే ఇవ్వడం లేదు” అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో పెరిగిన భూముల ధరలు, ఇప్పుడు పడిపోయాయని, రైతులపై పోలీసు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని, కానీ రైతుల మీద కోపం చూపడం తగదని హెచ్చరించారు.
హమాలీల పక్షపాతి కేసీఆర్
గతంలో కేవలం 8 రూపాయలు ఉన్న హమాలీ రేట్లను కేసీఆర్ 26 రూపాయలకు పెంచి, 250 శాతం ఆదాయం పెరిగేలా చేశారని కార్మికులు సంతోషం వ్యక్తం చేశారని కేటీఆర్ అన్నారు. ఐదేళ్లకు ఒకసారి రేట్లు పెరిగే దుస్థితి నుండి, రెండేళ్లకు ఒకసారి పెంపు సాధించుకోవడం కేసీఆర్ ఘనత అని హమాలీలు కొనియాడారంటూ కేటీఆర్ గుర్తు చేశారు. హమాలీల ఆరోగ్య భద్రతతో పాటు ఏ సమస్య ఉన్నా నెరవేర్చే బాధ్యత తనదని కేటీఆర్ భరోసా ఇచ్చారు. “మీ వీపు కాయలు కాసేలా కష్టపడుతున్నారు, మీ రుణం తీర్చుకుంటాను. మీరు ఐక్యంగా ఉండండి, రాబోయే రోజుల్లో కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాళేశ్వరానికి ప్రాణం పోసింది కేసీఆర్
నిన్న తాము సందర్శించిన కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తుందని, ఎక్కడ నీళ్లు ఉంటాయో గోదావరిలో ఆ పాయింట్ వెతికి పట్టుకొని కేసీఆర్ ప్రాజెక్టు కట్టారని అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతులు, పారిశ్రామికవేత్తలు, హమాలీలు అందరూ సంతోషంగా ఉండేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో లేకపోయినా ప్రజల్లో మమకారం పోలేదని, కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామని స్పష్టం చేశారు. హమాలీల ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత తనదని మరోసారి హామీ ఇచ్చారు. ఏ చిన్న సమస్య ఉన్నా తప్పకుండా పరిష్కరించుకుందామని, పార్టీ శ్రేణులు, కార్మికులు గట్టిగా ఉండాలని కోరారు.

