సీనియర్లకు ప్రాధాన్యం లేదంటూ కాంగ్రెస్కు రాజీనామా
బీఆర్ ఎస్లో చేరిన చిన్నబోయినపల్లి, మొద్దుల వెంకటాపురం నాయకులు
లక్ష్మణ్ బాబు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న నేతలు
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి, మొద్దుల వెంకటాపురం గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు తగిన ప్రాధాన్యం కల్పించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గంటా తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో పలువురు పార్టీకి రాజీనామా చేసి ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకుని బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా గంటా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన కొందరు నాయకులకే ప్రాధాన్యం పెరిగిందని, దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులను పూర్తిగా పక్కనబెట్టారని ఆరోపించారు. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేకుండా కొందరి సూచనల మేరకే పార్టీ వ్యవహారాలు సాగుతున్నాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని, గ్రామాల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ కారణాల వల్లే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై, ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ప్రజల కోసం చేస్తున్న కృషిపై విశ్వాసంతో తాము బీఆర్ఎస్లో చేరినట్లు పేర్కొన్నారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ.. సీనియర్ నాయకులను గౌరవించలేని కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేర్చగలదని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో చేరిన నాయకులు, కార్యకర్తలకు పార్టీలో సముచిత ప్రాధాన్యం, బాధ్యతలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నబోయినపల్లి, మొద్దుల వెంకటాపురం గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువజన ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

