వడ్డెపల్లి ఎల్పీఎస్ కు ఇనగాల బాట
యజమానుల ఆమోదంతో సాకారం
ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ముందడుగు
30 ఎకరాలు అప్పగింతకు ముందుకు వచ్చిన యజమానులు
ఆధునిక మౌలిక సదుపాయాలతో మారనున్న ప్రాంతం రూపురేఖలు
భూ యజమానుల స్వచ్ఛంద సహకారం అభినందనీయం
కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
కాకతీయ, వరంగల్బ్యూరో : నగర సుందరీకరణతో పాటు క్రమబద్ధమైన పట్టణాభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఎంతో ఉపయోగకరమని, భూ యజమానులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభివృద్ధికి శుభపరిణామమని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, వారిని ఒప్పించేందుకు చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి చేసిన కృషి వడ్డెపల్లి ఎల్పీఎస్ ప్రాజెక్టులో కీలక మార్పుకు దారితీసింది. ఆయన అనుసరించిన సంప్రదింపుల సరళి, క్షేత్రస్థాయిలో పారదర్శకతను పెంచడం ద్వారా భూ యజమానుల నమ్మకాన్ని పొందగలిగారు. ఫలితంగా హనుమకొండలోని వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ పరిధిలో ఉన్న సుమారు 30 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా అభివృద్ధి చేసేందుకు భూ యజమానులు స్వచ్ఛందంగా అంగీకారం తెలిపారు. మంగళవారం వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ భూ యజమానుల కమిటీ సభ్యులు, ప్రతినిధులు బూర విద్యాసాగర్, ఎం. విజయ్ కుమార్, డి. స్వరాజ్యలక్ష్మి, బూర అశోక్ కుమార్, బల్లెం వెంకటయ్య, రాజేష్, తిరుపతి రెడ్డిలు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్ రెడ్డిని కలిసి తమ నిర్ణయాన్ని తెలియజేశారు.
ప్రణాళికాబద్ధమైన వసతుల కల్పన
ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల ప్రకారం లేఅవుట్ అభివృద్ధికి అవసరమైన అధికారిక దరఖాస్తులు, భూమి యాజమాన్య పత్రాలు, ఇతర సంబంధిత డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులకు భూ యజమానులు సమర్పించారు. వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ ప్రాంతంలోని 30 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రావడంతో ఆ ప్రాంతంలో ప్రణాళికాబద్ధమైన రహదారులు, మౌలిక సదుపాయాలు, నివాస లేఅవుట్ల అభివృద్ధికి మార్గం సుగమం కానుంది. నగరానికి కీలకమైన ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించారు.
త్వరితగతిన కార్యాచరణ అమలు
ఈ ప్రాజెక్టు అమలును మరింత వేగవంతం చేయడానికి వచ్చే నాలుగు రోజుల్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. భూ యజమానుల కమిటీ ప్రతినిధులు బూర విద్యాసాగర్, ఎం. విజయ్ కుమార్, డి. స్వరాజ్యలక్ష్మి, బూర అశోక్ కుమార్, బల్లెం వెంకటయ్య, రాజేష్, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. ల్యాండ్ పూలింగ్లో యజమానులను భాగస్వామ్యం చేయడం ద్వారా నగరానికి లభించే ప్రయోజనాలను వివరించడంలో చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి విజయవంతం కావడంతో, ఈ ప్రాజెక్టు వేగంగా కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.

