218 స.నె. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
పేదలను రోడ్డున పడేసేలా కాంగ్రెస్ బుల్డోజర్ పాలన
ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు
కలెక్టరేట్లో వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నేతలు
కాకతీయ, రఘునాథపాలెం : రఘునాథపాలెం మండలం 218 సర్వే నంబర్లోని భూ నిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఖమర్ డిమాండ్ చేశారు. బాధితులతో కలిసి గురువారం వారు ఖమ్మం కలెక్టరేట్లో డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పగడాల నాగరాజు మాట్లాడుతూ.. 2009లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో 3,000 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసినా, అప్పట్లో స్థలాలు చూపలేదని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో సుమారు 650 మందికి స్థలాలు కేటాయించగా, వారు బేస్మెంట్లు, లెంటల్ స్థాయి వరకు ఇళ్లు నిర్మించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం అమరావతి హైవే, మోడల్ స్కూల్ పేరుతో లబ్ధిదారులను ఖాళీ చేయించడం సరికాదన్నారు. ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదని, పైగా ఎలాంటి ఆటంకం లేని ప్రాంతాల్లో ఉన్న 300 మంది పేదల ఇళ్లను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి పర్యటనలో బాధితుల గోడు
రేపు ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాకు వస్తున్న నేపథ్యంలో, బాధితుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే వినతిపత్రం ఇచ్చామని పేర్కొన్నారు. వెలుగుమట్ల కూల్చివేతల మచ్చ ఇంకా పోకముందే, మరో 650 పేద కుటుంబాలను రోడ్డున పడేసే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తోందని విమర్శించారు. వైఎస్సార్ ఆశయాల గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు, ఆయన ఇచ్చిన పట్టాలను గౌరవించకపోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘బుల్డోజర్ పాలన’ కొనసాగిస్తోందని, ముఖ్యమంత్రే హిట్లర్ను ఆదర్శంగా తీసుకున్నారని పగడాల నాగరాజు ఆరోపించారు. కూల్చివేతలు కాకుండా పేదల జీవితాలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మక్బుల్, తాజుద్దీన్, సకీనా, చిన్న నాగరాజు, ఉస్మాన్, పోలెపొంగు వెంకట్, గుంటి రాజు, బాధితులు పాల్గొన్నారు.

