- బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాలి
- ప్రజా సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాలి
- కార్యకర్తలకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు దిశానిర్దేశం
కాకతీయ, ఖమ్మం టౌన్ : రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఏన్కూర్ మండల కేంద్రంలో శనివారం జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా గ్రామ మరియు బూత్ స్థాయిల నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక వ్యూహాలతో పనిచేయాలని సూచించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ముఖ్యంగా రైతులు, యువత, మహిళలు, అణగారిన వర్గాల కోసం కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. రాజకీయాల్లో హుందాతనాన్ని పాటిస్తూ, వ్యక్తిగత ఆరోపణలకు దూరంగా ఉండి, పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, సానుకూల అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వారి మద్దతు కూడగట్టాలని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండాలని, క్రమశిక్షణతో పనిచేసి ఖమ్మం జిల్లాలో కమలం జెండాను రెపరెపలాడించాలని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నరుకుల వెంకటేశ్వర్లు, పార్టీ సీనియర్ నాయకులు మందడపు సుబ్బారావు, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు బండారు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

