ఆర్ఎంసీ ప్లాంట్పై చర్యలకు ఎమ్మార్వో వెనకడుగు..?
నాలా కన్వర్షన్ లేకుండానే కార్యకలాపాలు..!
కాలుష్యం, రోడ్ల ధ్వంసంతో గ్రామస్తుల ఆందోళన..ఫిర్యాదులు
సదరు సంస్థకు నోటీసులు జారీ చేసి వదిలేసిన రెవెన్యూ అధికారులు
గ్రీవెన్స్ ఫిర్యాదులకూ స్పందన లేక ప్రజల్లో అసంతృప్తి
ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి
కాకతీయ, మయూరి సెంటర్ : ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం రెవెన్యూ పరిధిలో ఎన్హెచ్–365ఏ జాతీయ రహదారి నిర్మాణ పనులకు ఏర్పాటు చేసిన రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసీ) ప్లాంట్పై వస్తున్న ఫిర్యాదుల విషయంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లాంట్ వల్ల తీవ్ర కాలుష్యం, గ్రామ రోడ్ల ధ్వంసం, వ్యవసాయ భూములపై ప్రభావం వంటి సమస్యలు నెలకొన్నాయని గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోతున్నారు. నోటీసులు జారీ చేయడానికే అధికారులు పరిమితమయ్యారని, అనంతరం చర్యలు ముందుకు సాగలేదని ఆరోపిస్తున్నారు. సుమారు నాలుగు నెలలుగా పనిచేస్తున్న ఈ ప్లాంట్ నుంచి నిరంతరం సిమెంట్ దుమ్ము, యంత్రాల శబ్దం వెలువడుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. భారీ లారీల రాకపోకలతో గ్రామంలోని అంతర్గత రహదారులు దెబ్బతింటుండగా, సమీపంలోని వ్యవసాయ భూముల్లో పంటల దిగుబడిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్ నుంచి వెలువడుతున్న మురుగునీటిని సమీప పొలాల్లోకి వదులుతున్నారని, దీంతో భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని కూడా ఆరోపిస్తున్నారు.

గ్రీవెన్స్లో ఫిర్యాదు… చర్యలు మాత్రం శూన్యం
ప్లాంట్ వల్ల ఎదురవుతున్న సమస్యలపై గ్రామస్తులు గతంలో జిల్లా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల అనంతరం సంబంధిత శాఖలు పరిశీలించినప్పటికీ ఇప్పటి వరకు స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నాలా కన్వర్షన్ పూర్తి కాకుండానే ప్లాంట్ నిర్వహిస్తున్నారని, పంచాయతీ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ (ఎన్ఓసీ), తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీసీబీ) అనుమతుల విషయంలో కూడా సందేహాలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంతటి ఆరోపణలు ఉన్నప్పటికీ మండల రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఏవైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానాలను కూడా గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు.
మూడు కుంటలకే కన్వర్షన్… మిగతాదంతా వ్యవసాయ భూమే
కాచిరాజుగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 62A/2, 64/A/1/2, 64/A/1, 76/E/3, 76/E/2లో కలిపి సుమారు ఏడు ఎకరాల వ్యవసాయ భూమిని స్థానిక రైతు నుంచి జీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ లీజుకు తీసుకుంది. అయితే తెలంగాణ భూభారతి పోర్టల్లో కేవలం మూడు కుంటల విస్తీర్ణానికే నాలా కన్వర్షన్ నమోదై ఉండగా, మిగిలిన భూమి వ్యవసాయ భూమిగానే ఉన్నట్లు సమాచారం. అలాంటి పరిస్థితిలో మొత్తం స్థలంలో ఆర్ఎంసీ ప్లాంట్ ఏర్పాటు చేసి కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ భూమిని చట్టబద్ధంగా కన్వర్ట్ చేయకుండా పరిశ్రమ నిర్వహించడం వల్ల పర్యావరణం, భూగర్భ జలాలు, వ్యవసాయంపై ప్రభావం పడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నోటీసుల తర్వాత ముందడుగు ఎక్కడ?
ఈ వ్యవహారంపై ఇటీవల వరుస కథనాలు వెలువడిన అనంతరం గ్రామ పరిపాలన అధికారి (జీపీఓ) సంబంధిత నిర్మాణ సంస్థకు నాలా కన్వర్షన్ అంశంపై నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అయితే ఆ నోటీసులకు సంస్థ యాజమాన్యం ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదని సమాచారం. అయినప్పటికీ తదుపరి చర్యలు తీసుకోకపోవడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిబంధనల ఉల్లంఘన జరిగి ఉంటే పూర్తి స్థాయి విచారణ నిర్వహించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కాలుష్య సమస్యను తక్షణమే పరిష్కరించాలని గ్రామస్థులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

