స్క్రాప్ దందాకు అధికార అభయహస్తమా..?
అర్ధరాత్రి వరకు ప్రభుత్వ కార్యాలయంలో సమావేశాలపై చర్చ
కాపర్ కేసు సెటిల్ చేసేందుకు ప్రయత్నాలున్నాయన్న ఆరోపణలు
కొనుగోలుదారులు–అధికారుల సమావేశాలపై పెరుగుతున్న అనుమానాలు
అసలు తెర వెనుక ఎవరు..? సమగ్ర విచారణకు డిమాండ్
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చిన స్క్రాప్, కాపర్ కొనుగోలు వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అక్రమ కాపర్ కొనుగోళ్లపై నమోదైన కేసుల నేపథ్యంలో ఇప్పుడు కొనుగోలుదారులు, కొందరు అధికారులు, రాజకీయ నాయకుల మధ్య వరుస సమావేశాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా శుక్రవారం రాత్రి ప్రభుత్వ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు జరిగినట్లు ప్రచారం జరుగుతున్న సమావేశాలు పలు ప్రశ్నలకు తావిస్తున్నాయి. స్థానికంగా వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం, కాపర్ కొనుగోలు వ్యవహారంలో నమోదైన కేసును సెటిల్ చేసేందుకు మధ్యవర్తుల ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. కేసులో ఉన్న కొనుగోలుదారుల తరఫున కొందరు ప్రభావశీలులు రంగంలోకి దిగినట్లు కూడా స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు.
రాత్రి సమావేశాలపై ప్రశ్నలు
స్థానికుల కథనం ప్రకారం, శుక్రవారం రాత్రి 11 గంటల వరకు కొందరు కొనుగోలుదారులు, అధికారులు, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ కార్యాలయంలో విధి సమయం ముగిసిన తర్వాత ఇలాంటి సమావేశాలు ఎందుకు జరిగాయి? వాటి ఉద్దేశం ఏమిటి? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అధికారులకు అధికారిక విధులకు సంబంధం లేకుండా కొనుగోలుదారులతో అర్ధరాత్రి వరకు సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమావేశాలపై పూర్తి వివరాలు వెల్లడించాలని వారు కోరుతున్నారు.
కాపర్ కేసు… సెటిల్మెంట్ ప్రయత్నాలా..?
కాపర్ కొనుగోలు వ్యవహారంలో నమోదైన కేసును చట్టపరమైన దర్యాప్తు దిశగా కాకుండా రాజీ దిశగా మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. డబ్బు లావాదేవీల ద్వారా కేసును ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను నిర్ధారించే అధికారిక ఆధారాలు ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు. సంబంధిత అధికారులు కూడా ఈ ప్రచారాలపై స్పందించలేదు. ఈ వ్యవహారంలో కొనుగోలుదారులుగా ప్రచారంలో ఉన్న కొందరు వ్యక్తులు “ఎవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చేశాం” అంటూ మాట్లాడుతున్నారనే ప్రచారం కూడా స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలు నిజమేనా? అయితే ఎవరిని ఉద్దేశించి చెప్పారన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ తరహా ప్రచారం దర్యాప్తు సంస్థల దృష్టికి వెళ్లాల్సిన అంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్క్రాప్, కాపర్ అక్రమ కొనుగోళ్ల వ్యవహారంలో కొందరు అధికారుల పాత్రపైనా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టన్నుల కొద్దీ స్క్రాప్ తరలిపోతున్నా ఎందుకు అడ్డుకోలేకపోయారు? కేసు నమోదైన తర్వాత కూడా సంబంధిత వ్యక్తులు ఎందుకు ధీమాగా వ్యవహరిస్తున్నారు? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల స్పందన ఇంకా అందుబాటులోకి రాలేదు.
విచారణతోనే తేలాల్సిన నిజాలు
స్క్రాప్ దందా, కాపర్ కొనుగోలు వ్యవహారం, కేసు నమోదైన తర్వాత జరిగినట్లు ప్రచారం జరుగుతున్న సమావేశాలు, సెటిల్మెంట్ ఆరోపణలు—ఈ అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగినట్లు ప్రచారం జరుగుతున్న సమావేశాల వివరాలు, సంబంధిత అధికారుల పాత్ర, కేసు దర్యాప్తు పురోగతిపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంలో వినిపిస్తున్న ఆరోపణలు, ప్రచారాలపై దర్యాప్తు సంస్థలు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారిస్తేనే ప్రజల్లో నెలకొన్న అనుమానాలకు తెరపడే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

