ఖమ్మంను ప్రభుత్వం గాలికొదిలేసింది
ముగ్గురు మంత్రులున్నా.. నగరాన్ని సమస్యల కూపంగా మార్చేశారు
చెత్త కుప్పలే కాంగ్రెస్ పాలనకు నిదర్శనం
ఖమ్మం పట్టణ బీఆర్ఎస్ నాయకుల ధ్వజం
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్పోరేషన్ ముట్టడి
డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రం
కాకతీయ, ఖమ్మం: ఖమ్మం నగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల మయంగా మార్చేసిందని, ప్రజల కష్టాలను పూర్తిగా గాలికొదిలేసిందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగర పాలన పూర్తిగా గాడితప్పిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా పాలకులు కాలం గడుపుతున్నారని ధ్వజమెత్తారు.

చెత్త కుప్పలే కాంగ్రెస్ పాలనకు నిదర్శనం
నగరంలో పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని, చెత్తను రోజుల తరబడి తొలగించక ప్రజలను రోగాల బారిన పడేలా చేస్తున్నారని ఆరోపించారు. వీధి దీపాలు వెలగక ప్రజలు రాత్రివేళ భయాందోళనలకు గురవుతున్నారని, గుంతలమయమైన రహదారులతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయని అన్నారు. పార్కులు నిర్లక్ష్యానికి గురై ప్రజలకు వినియోగం లేకుండా పోయాయని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు, నీటి కనెక్షన్ల మంజూరు, ఇంటి పన్నుల వ్యవహారం, మున్సిపల్ డీజిల్ వినియోగం, పబ్లిక్ టాయిలెట్లకు అనుబంధంగా షాపుల కేటాయింపులో జరిగిన అక్రమాలపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన వారిని కాపాడే ప్రయత్నాలు మానుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరింత ఉద్ధృతంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడం ప్రభుత్వ బాధ్యత అని, ఖమ్మం ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మాజీ నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఖమర్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కర్ణాటక కృష్ణ, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మబ్బుల్, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, మాజీ కార్పొరేటర్లు బిక్కసాని ప్రశాంతలక్ష్మి, పల్లా రోషిలిని, శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, కూరాకుల వల్లరాజుతో పాటు తాజుద్దీన్, గొల్లపూడి రాంప్రసాద్, దేవభక్తిని కిషోర్, జస్వంత్, సద్దాం షేక్, మాటేటి కిరణ్, మోరంపూడి సాయి, షకీన, ఉస్మాన్, వీరేందర్, అశోక్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

