బోర్డు నేలకూలినా.. నిద్రలోనే మార్కెట్ యంత్రాంగం
ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లో అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
రోజులు గడుస్తున్నా బోర్డు పునరుద్ధరణకు చర్యలేవీ లేవు
కాకతీయ, ఏన్కూరు: ఖమ్మం జిల్లా ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తర్వాత అత్యధిక ఆదాయం సమకూర్చే మార్కెట్లలో ఒకటైన ఏన్కూరు మార్కెట్కు గుర్తింపుగా ఉన్న ప్రధాన బోర్డు రోజులుగా నేలపై పడివున్నా దానిని తిరిగి ఏర్పాటు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని రైతులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో సెక్రటరీ, ఇద్దరు సూపర్వైజర్లు, సుమారు ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నప్పటికీ, మార్కెట్ నిర్వహణలో కనీస బాధ్యత కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, వ్యాపారులు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన ద్వారం వద్ద బోర్డు నేలకూలి ఉండటం మార్కెట్ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని స్థానికులు అంటున్నారు. కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే మార్కెట్లో కనీస గుర్తింపు బోర్డును కూడా సక్రమంగా నిర్వహించలేకపోవడం విచారకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ నిర్వహణను పర్యవేక్షించాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నేలపై పడివున్న మార్కెట్ బోర్డును వెంటనే మరమ్మతులు చేసి, ప్రధాన ద్వారం వద్ద తిరిగి ఏర్పాటు చేయాలని రైతులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

