- ఆఫీస్ టైమ్ లో క్యాంటీన్ల చుట్టూ సిబ్బంది.
- గంటల కొద్ది ఫోన్లోనే డ్యూటీ!??

కాకతీయ, మయూరి సెంటర్: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉన్న షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖలో కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు విధులను సక్రమంగా నిర్వహించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం రోజూ వందలాది మంది కలెక్టరేట్ కి వస్తుంటారు. కానీ ఆఫీస్ సమయంలో సంబంధిత సిబ్బంది డెస్క్ ల వద్ద కాకుండా ఇందిరా మహిళ క్యాంటీన్ ఏరియాలో, ఫోన్లలో గంటల కొద్దీ సమయం గడుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫైళ్లపై సంతకాలు, ధ్రువపత్రాల జారీ, ఫిర్యాదుల స్వీకరణ వంటి కీలకమైన పనులు పెండింగ్ లో పడుతున్నాయని, దీనితో పేద, మధ్యతరగతి ప్రజలు గంటల కొద్దీ వేచి ఉండి తిరిగి వెళ్తున్నారని వాపోతున్నారు.
అత్యవసర పనుల కోసం వచ్చినా సరైన సమాధానం దొరకడం లేదని, “సార్ లేరు, కాసేపట్లో వస్తారు” అనే సమాధానమే వస్తుందని బాధితులు వాపోతున్నారు. జిల్లా అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

