చనిపోయాకా గుర్తుండేలా జీవించాలి : పొంగులేటి
మంగళగూడెంలో కన్నేటి వెంకన్న విగ్రహావిష్కరణ
అంబేడ్కర్ విగ్రహాన్నీ ఆవిష్కరించిన మంత్రి
కాకతీయ, ఖమ్మం రూరల్ : ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా జీవించడమే గొప్ప జీవితమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు స్వర్గీయ కన్నేటి వెంకన్న ద్వితీయ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన మంత్రి, గ్రామంలో ఏర్పాటు చేసిన కన్నేటి వెంకన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్నీ ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరూ ఒకరోజు మరణించడం సహజమేనని, అయితే మరణించిన తర్వాత కూడా సమాజం గుర్తుంచుకునేలా జీవించడం నిజమైన గొప్పతనమని పేర్కొన్నారు.
పదిమందికి చేసిన మేలే శాశ్వత సంపాదన
మనిషి సంపాదించే ఆస్తుల కంటే సమాజానికి చేసిన సేవ, సంపాదించుకున్న అభిమానం శాశ్వతంగా నిలుస్తాయని మంత్రి పొంగులేటి అన్నారు. కన్నేటి వెంకన్న తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారని, కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచి ప్రజల ప్రేమాభిమానాలు సంపాదించుకున్నారని కొనియాడారు. భౌతికంగా దూరమైనా ఆయన సేవలను గుర్తు చేస్తూ గ్రామంలో విగ్రహం రూపంలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన చూపిన సేవా మార్గం యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కన్నేటి వెంకన్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

