హైదరాబాద్కు దీటుగా మూడు మహానగరాలు..!
వరంగల్-ఖమ్మం-కరీంనగర్కు గ్రోత్ కారిడార్ మాస్టర్ప్లాన్
హైదరాబాద్ తరహాలో ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణానికి డీపీఆర్లు
రూ.14 వేల కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్సిగ్నల్
మొదటి విడతలో రూ.5,681 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం
కార్పొరేషన్ ఎన్నికల వేళ కాంగ్రెస్ అస్త్రంగా మెగా ప్రణాళిక
ద్వితీయ శ్రేణి నగరాల రూపురేఖలు మార్చే వ్యూహానికి శ్రీకారం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్పై పెరుగుతున్న భారం తగ్గించడంతో పాటు ద్వితీయ శ్రేణి నగరాలను సమాంతర అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాలను అనుసంధానిస్తూ ప్రత్యేక గ్రోత్ కారిడార్ మాస్టర్ప్లాన్ను రూపొందిస్తోంది. ఈ మూడు నగరాలకు హైదరాబాద్ తరహాలో ఔటర్ రింగ్ రోడ్లను నిర్మించి, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతమివ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.14 వేల కోట్ల నిధులను కోరగా, తొలి విడతలో ఐదు కీలక ప్రాజెక్టులకు రూ.5,681.04 కోట్లకు ఆమోదం లభించింది. ఇందులో కేంద్రం తన వాటాగా 25 శాతం మేర రూ.1,420.26 కోట్లను ఇప్పటికే విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఔటర్ రింగ్ రోడ్లతో నగరాల రూపురేఖలు మార్పు
వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో హైదరాబాద్ తరహాలో ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం డీపీఆర్ల తయారీ వేగంగా కొనసాగుతోంది. గ్రోత్ కారిడార్ అమల్లోకి వస్తే పరిశ్రమలు, లాజిస్టిక్స్, గిడ్డంగులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. సీడీఎంఏ పరిధిలోని మున్సిపాలిటీలను అనుసంధానిస్తూ ప్రత్యేక అభివృద్ధి క్లస్టర్లను కూడా రూపొందిస్తున్నారు.
టూరిజం.. పరిశ్రమలకు కొత్త కారిడార్లు
ద్వితీయ శ్రేణి నగరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రత్యేక కారిడార్ల రూపకల్పన కూడా వేగం అందుకుంది. నల్గొండ-యాదాద్రి ప్రాంతాలను అనుసంధానిస్తూ టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్-నాగోబా-బాసర-కడెం ప్రాంతాలను కలుపుతూ టూరిజం కారిడార్, మహబూబ్నగర్-భూత్పూర్-జడ్చర్ల ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్, కొత్తగూడెం-పాల్వంచ-సుజాతనగర్ ప్రాంతాల్లో ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ కారిడార్లు ప్రాంతీయ సమతుల అభివృద్ధికి దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.
ఎన్నికల వేళ రాజకీయ ప్రాధాన్యం
వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ మెగా అభివృద్ధి ప్రణాళికలకు శ్రీకారం చుట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ రెండు కార్పొరేషన్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్న నేపథ్యంలో అభివృద్ధి అజెండాతో ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్కు బలమైన పట్టున్న ఈ నగరాల్లో ఇటీవల రాజకీయ సమీకరణాలు మారడంతో కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకుంది. గ్రోత్ కారిడార్, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది
ద్వితీయ శ్రేణి నగరాలను అభివృద్ధి చేయడం ద్వారా హైదరాబాద్పై ఒత్తిడి తగ్గడంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నియంత్రించాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఐటీ, తయారీ రంగాలను జిల్లాలకు విస్తరించడం ద్వారా స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణతో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, ఇతర మౌలిక వసతులను ముందుగానే అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భూముల విలువలు పెరగడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా కొత్త ఊపు లభించే అవకాశం ఉందని రియల్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అమలైతే తెలంగాణలోని ప్రధాన జిల్లా కేంద్రాలు మినీ మహానగరాలుగా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది.

