పెద్ది కుటుంబానికి కేసీఆర్ భరోసా
రేపు నల్లబెల్లికి మాజీ సీఎం.. పిల్లల భవిష్యత్తుకు పార్టీ అండ
రూ.2.25 కోట్ల ఆర్థికసాయం అందజేయాలని నిర్ణయం
సంస్మరణ సభకు అగ్రనేతలు… కీలక రాజకీయ ప్రకటనపైనా ఆసక్తికర చర్చలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో/నల్లబెల్లి : దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. పెద్ది కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున పూర్తి భరోసా కల్పించడంతో పాటు ఆయన పిల్లల భవిష్యత్తు, చదువు, కుటుంబ సంక్షేమానికి అండగా ఉండాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థికసాయం అందించాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 09న నల్లబెల్లికి కేసీఆర్ వెళ్లనున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి స్వగ్రామంలోని నివాసానికి చేరుకుని ఆయన సతీమణి పెద్ది స్వప్నతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
పిల్లలకు చెరో రూ.కోటి
పెద్ది సుదర్శన్రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున, ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం రూ.25 లక్షలు కేటాయించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. మొత్తం రూ.2.25 కోట్లను బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నాయకులతో చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెద్ది కుటుంబానికి పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.
సంస్మరణ సభకు అగ్రనేతలు
పెద్ది సుదర్శన్రెడ్డి సంస్మరణ సభ సోమవారం నల్లబెల్లిలో జరగనుంది. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా నాయకులు, పార్టీ శ్రేణులు హాజరుకానున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్రావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సుమారు 40 వేల మందికి భోజన వసతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సంస్మరణ సభ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన నల్లబెల్లి వారాంతపు సంతను బంద్ చేయనున్నట్లు స్థానిక సర్పంచి తెలిపారు.
కార్యకర్తల్లో భరోసాపై చర్చ
పెద్ది సుదర్శన్రెడ్డి ఆకస్మిక మరణంతో నర్సంపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తల్లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో సంస్మరణ సభకు ప్రాధాన్యం ఏర్పడింది. పెద్ది రాజకీయ వారసత్వం, పార్టీ కార్యకర్తల భవిష్యత్తుపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు ఎలాంటి సంకేతాలు ఇస్తారన్న చర్చ జరుగుతోంది. కుటుంబానికి ఆర్థిక అండ ప్రకటించిన పార్టీ అధినాయకత్వం.. నియోజకవర్గ పార్టీ శ్రేణులకు కూడా భరోసా కల్పించేలా ఏమైనా నిర్ణయం ప్రకటిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన పెద్ది సుదర్శన్రెడ్డి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 2018లో నర్సంపేట నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు 2016లో తెలంగాణ సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. గత నెల 26న ఛాతీలో నొప్పితో అస్వస్థతకు గురైన ఆయనకు హనుమకొండలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించగా ఐదు రోజుల పాటు చికిత్స పొందుతూ గత నెల 31న కన్నుమూశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్ నల్లబెల్లికి రానుండటంతో రాజకీయంగా కూడా ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

