రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవం
సన్నబియ్యంతో ప్రతి పేద కుటుంబానికి భరోసా
రైతు భరోసాతో అన్నదాతకు అండ
2 ఏళ్లలో 7 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు
72 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
బీజేపీ, బీఆర్ఎస్ నాణేనికి బొమ్మా బొరుసు
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రేషన్ కార్డు కేవలం ఒక కాగితం కాదని, పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదన్నదే ప్రజా ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు రేషన్ షాపులను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. సన్నబియ్యాన్ని ప్రతి పేద కుటుంబానికి అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, నవీన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్లు నిర్మల జగ్గారెడ్డి, ఫహీం, గిరిధర్రెడ్డి, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇవాళ ఒకరు సన్నబియ్యం గురించి, మరొకరు ఇందిరమ్మ ఇళ్ల గురించి, ఇంకొకరు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ వేర్వేరు కాదని, అవి నాణేనికి బొమ్మా బొరుసులాంటివని విమర్శించారు. ఏనాడైనా సన్నబియ్యం ఇచ్చి పేదల కడుపు నింపాలని ఆలోచించారా అని ఆ పార్టీల నాయకులను ప్రశ్నించారు.


కరెంటు, ధాన్యం కొనుగోళ్లలో మార్పు
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని ఆనాడు ప్రచారం చేశారని రేవంత్రెడ్డి గుర్తుచేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు అవుతున్నా ఏ ఒక్క క్షణమైనా కరెంటు పోయిందా అని ప్రశ్నించారు. ప్రతి పల్లెలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నది నిజం కాదా అని నిలదీశారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు వ్యవసాయానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఆనాడు వరి వేసుకుంటే ఉరే అని మాట్లాడినవారు ఇప్పుడు సన్నధాన్యం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సన్నధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ అందిస్తున్న వాస్తవం ప్రజల కళ్ల ముందే ఉందన్నారు. రైతు భరోసా మొత్తాన్ని రూ.2 వేలు పెంచి ఏడాదికి రూ.12 వేలు అందిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటివరకు రూ.36 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.21 వేల కోట్లు ఖర్చు చేసి రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. 32 నెలల్లో రైతులు పండించిన ధాన్యానికి రూ.90 వేల కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ చేశామని తెలిపారు. రైతులను రాజులుగా గౌరవించే సంస్కృతి తమ ప్రభుత్వంలో ఉందన్నారు. 2.5 ఏళ్లలో రైతుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని గర్వంగా చెబుతున్నానన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరారు. శాసనసభకు వచ్చి రైతులకు తాము చేసిన మేలు ఏమిటో, గతంలో మీరు చేసిన అన్యాయం ఏమిటో చర్చిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణలో రుణం లేని రైతులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వ నివేదికలు చెబుతున్నా బీజేపీ నాయకులకు అవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతుల సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదన్నారు.
ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు సొంత గూడు
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పినవారు ఏ ఒక్కరికైనా ఇచ్చారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అయితే పేదల తమ్ముడిగా తాను 2 ఏళ్లలో 7 లక్షల ఇళ్లను మంజూరు చేశానని తెలిపారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని, ఇకపై ఉండదని స్పష్టం చేశారు. పేదలకు సొంత గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒంటరి మహిళలందరికీ పెన్షన్లు ఇచ్చి ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు. చేనేత, గీత కార్మికులకు కూడా పెన్షన్లు అందిస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని, అర్హత ఉన్నవారికి పెన్షన్లు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఆహార భద్రతతో పాటు పేదలకు ఇళ్లు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలను అందిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.
యువతకు ఉద్యోగాలు, భవిష్యత్తుకు భరోసా
2.5 ఏళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. నిరుద్యోగ యువత మాయమాటలు చెప్పే వారి ఉచ్చులో పడవద్దని సూచించారు. ప్రతి 6 నెలలకు ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మాట ఇస్తే మట్టిలో కలిసే వరకు నిలబడే నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వమని అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదేనని చెప్పారు. దుర్మార్గులు రాజకీయం కోసం, అధికారం కోసం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వారి మాయలో పడకుండా ఉద్యోగ పరీక్షలకు సిద్ధం కావాలని యువతకు సూచించారు. ప్రజల హక్కులను కాదనబోమని, అవకాశాలను తొలగించబోమని స్పష్టం చేశారు. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని యువతకు మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు ఉద్యోగ నియామక ప్రక్రియను కొనసాగిస్తామన్నారు.
కుట్రలు చేసినా ప్రజల ఆశీర్వాదమే
ప్రభుత్వంపై కొంతమంది అఘోరా పూజలు, చేతబడులు చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఎవరైనా ప్రజలపై చేతబడులు చేస్తారా అని ప్రశ్నించారు. నిజాలు చెబితే తమ మహేష్కుమార్గౌడ్కు నోటీసులు ఇస్తున్నారని అన్నారు. అడుగు పెడితే సామాజిక మాధ్యమాల్లో పెట్టే వారు తమిళనాడులో గుడులకు వెళ్లిన విషయం ఎందుకు రహస్యంగా ఉంచారని ప్రశ్నించారు. వాళ్లు ఎన్ని క్షుద్ర పూజలు చేసినా దేవుడి ఆశీర్వాదం తమపై ఉందన్నారు. అందుకే ఎల్నినో కరువులోనూ ఎల్లంపల్లి నిండిందని వ్యాఖ్యానించారు. దేవుడి ఆశీర్వాదంతో పాటు ప్రజల ఆశీర్వాదం కూడా తమపై ఉండాలని కోరారు. 2034 వరకు తమకు ప్రజల ఆశీర్వాదం ఉండాలని ఆకాంక్షించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి పోటీ చేయాలో వద్దో అనేది ఆయన చేతిలో కూడా లేదని, అది రాహుల్గాంధీ చేతిలోనే ఉందని ముఖ్యమంత్రి అన్నారు. రాహుల్గాంధీ రాముడు అయితే జగ్గన్న హనుమంతుడి లాంటి వాడని పేర్కొన్నారు. ఆ రాముడి మాటను ఈ హనుమంతుడు ఎప్పుడూ జవదాటడని అన్నారు. రూ.100 కోట్లు ఖర్చు పెట్టినా జగ్గారెడ్డి లాంటి నాయకులు దొరకరని కొనియాడారు. ఎన్నికల్లో ఓడిపోయినా కుటుంబాన్ని కూడా వదిలి ప్రజలతోనే ఉంటున్నారని చెప్పారు. తెలంగాణలో జగ్గారెడ్డి లాంటి నాయకుడు లేడన్నారు. అలాంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండాలని, జగ్గారెడ్డికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, నవీన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్లు నిర్మల జగ్గారెడ్డి, ఫహీం, గిరిధర్రెడ్డి, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

