ప్రమాద రహిత సమాజానికి ఏకం కావాలి
అరైవ్–అలైవ్తో ప్రజల్లో చైతన్యం
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
మానవహారంగా ఏర్పడి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ
అంబేద్కర్ జయంతి సందర్భంగా అవగాహన కార్యక్రమం
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ప్రమాద రహిత సమాజ నిర్మాణానికి ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్వో సిర్ధార్ విక్రమ్ సింగ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.
మానవహారంతో చైతన్యం
అనంతరం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న “అరైవ్–అలైవ్” కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ మానవహారం ఏర్పాటు చేసి, ట్రాఫిక్ నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం ప్రాణరక్షణకు కీలకమని, మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం ప్రాణాంతకమని అధికారులు వివరించారు.
సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రమాదాల నివారణలో సమాజం మొత్తం భాగస్వామ్యం కావాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

