మొక్కజొన్న కొనుగోళ్లలో షరతులు విధించొద్దు
ఫంగస్, సన్నాల పేరుతో రైతులను వేధించడం దారుణం
సాగర్ జలాలు విడుదల చేసి ఎండిపోతున్న వరిని ఆదుకోవాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు
కాకతీయ, ఖమ్మం టౌన్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు మార్కెట్లలో పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అత్యంత దుర్మార్గమని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ధ్వజమెత్తారు. మొక్కజొన్న కొనుగోళ్లలో అధికారులు పెడుతున్న నిబంధనలను తక్షణమే తొలగించాలని, ఎండిపోతున్న వరి పొలాలను కాపాడేందుకు నాగార్జున సాగర్ జలాలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం రైతాంగ సమస్యలపై ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పెట్టుబడులు పెరిగి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని కోటేశ్వరరావు ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో క్వింటాల్ మొక్కజొన్నకు కేవలం రూ. 1700 నుండి రూ. 1800 మాత్రమే పలుకుతోందని, ఇది పెట్టుబడికి కూడా సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మార్క్ఫెడ్ అధికారులు ఫంగస్, సన్నాల పేరుతో కొర్రీలు పెడుతూ రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. నాణ్యత పరీక్షల పేరుతో కాలయాపన చేయడం వల్ల రైతులు గత్యంతరం లేక తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటున్నారని, మార్కెట్ చైర్మన్ వెంటనే స్పందించి కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలని డిమాండ్ చేశారు.
నిలువునా ఎండిపోతున్న వరి పొలాలు
సాగర్ జలాలను ఆకస్మికంగా నిలిపివేయడంతో ఆయకట్టు చివరి ప్రాంతాల్లో వరి పంట చేతికొచ్చే దశలో ఎండిపోతోందని కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని, తక్షణమే సాగర్ నీటిని విడుదల చేసి పంటను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మార్క్ఫెడ్ అధికారులపై జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం రవాణాకు లారీల కొరత లేకుండా చూడాలని, అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఇంకా ఆలస్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ ఎల్లప్పుడూ రైతు పక్షాన నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు.

