ప్రతి పేదవాడికి సొంతింటి భాగ్యం
అర్హులందరికీ విడతల వారీగా ఇళ్ల మంజూరు
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
దమ్మన్నపేటలో కలెక్టర్తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ప్రతి పేదవాడికి సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఆశయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. మంగళవారం వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథులుగా హాజరై గృహాలను ప్రారంభించారు. గృహ ప్రవేశం అనంతరం, లబ్ధిదారురాలైన మెరుగు రామ, ఆమె భర్త రాజల్ దంపతుల నూతన గృహంలో ఎమ్మెల్యే కాసేపు గడిపారు. ఇంటి సౌకర్యాల పట్ల వారి సంతృప్తిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంత ఇల్లు లేని పేదల ముఖాల్లో కనిపించే ఆనందమే ప్రభుత్వానికి నిజమైన తృప్తినిస్తుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇళ్లను మంజూరు చేస్తుందని, ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
మౌలిక వసతులపై కలెక్టర్ ఆదేశాలు..
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లతో పాటు ఆయా కాలనీల్లో విద్యుత్ సౌకర్యం, తాగునీటి సరఫరా మరియు డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. లబ్ధిదారులు తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రాంరెడ్డి, వరంగల్ ఆర్డీవో సుమ, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

