నగర అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
ప్రజలకు మౌలిక వసతులు అందుబాటులోకి తేవాలి
చర్చి కాంపౌడ్ ఓవర్ బ్రిడ్జ్ మరమ్మతులు చేపట్టాలి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని చర్చికాంపౌండ్, ప్రకాష్ నగర్ ఓవర్ బ్రిడ్జిలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జిల ప్రస్తుత పరిస్థితి, మరమ్మత్తుల అవసరం, ట్రాఫిక్ సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. చర్చికాంపౌండ్ ఓవర్ బ్రిడ్జిపై ప్రయాణించే వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. బ్రిడ్జి మధ్యభాగంలో రబ్బరు స్ట్రిప్స్ ఏర్పాటు చేసి వాహనాల ప్రయాణాన్ని సాఫీగా మార్చాలని ఆదేశించారు. బ్రిడ్జిపై ఉన్న గుంతలు, పగుళ్లు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. బ్రిడ్జి మీద ఉన్న పూల కుండలలోని మొక్కలను సంరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
నాణ్యతతో కూడిన నిర్మాణాలు
అవసరమైన చోట్ల హెచ్చరిక బోర్డులు, ప్రమాదాల సూచనలు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నగర అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న అన్ని పనులు నాణ్యతతో, సమయపాలనతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను దశలవారీగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

