టన్నెల్ పనులు 15 రోజుల్లో పూర్తవ్వాలి
యాతాలకుంటలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలి
వర్షాకాలం నాటికి సత్తుపల్లి ఆయకట్టుకు గోదావరి జలాలు
పనులు ఆలస్యమైతే అధికారులపై కఠిన చర్యలు తప్పవు
చిన్న చిన్న భూ సమస్యల వల్ల ప్రాజెక్టు పనులు ఆగకూడదు
సీతారామ ఎత్తిపోతల పథకంలో 3 పంప్ హౌస్లు సిద్ధంగా ఉన్నాయి
రూ.700 కోట్ల అంచనా వ్యయంతో ట్రంక్ కాలువ పనులు సాగుతున్నాయి
ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో అడ్డంకులను తొలగించాలి
జూలూరుపాడు టన్నెల్ పూర్తయితేనే పాలేరుకు నీరు చేరుతుంది
రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లతో కలిసి సత్తుపల్లి మండలంలో మంత్రి విస్తృత పర్యటన
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష
కాకతీయ,ఖమ్మం బ్యూరో/సత్తుపల్లి : సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగమైన యాతాలకుంట టన్నెల్ పనులను యుద్ధ ప్రాతిపదికన 15 రోజుల్లోగా పూర్తి చేసి, రాబోయే వర్షాకాలం నాటికి సత్తుపల్లి ఆయకట్టుకు గోదావరి జలాలు అందించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, అంకిత్ లతో కలిసి మంత్రి సత్తుపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. సీతారామ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న యాతాలకుంట టన్నెల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మరియు ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన సత్తుపల్లి ట్రంక్ కాలువ పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. యాతాలకుంట టర్మినల్కు సంబంధించిన మొత్తం 1.78 కిలోమీటర్ల పనుల్లో చివరి 30 మీటర్ల పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, వాటిని మరో రెండు వారాల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గోదావరిలో వరదలు వచ్చేలోపు టర్మినల్ ఎగువ భాగంలోని స్ట్రక్చర్ నంబర్లు 5 నుంచి 10 వరకు ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. మే నెలాఖరులోగా అసంపూర్తిగా ఉన్న అన్ని నిర్మాణాలను పూర్తి చేసి, వర్షాకాలానికి ముందే టన్నెల్ ఎగువ భాగంలో ఉన్న ఆరు స్ట్రక్చర్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

ఆయకట్టుకు సాగునీరే ప్రధాన లక్ష్యం
సత్తుపల్లి ట్రంక్ కాలువ ద్వారా సుమారు 43 కిలోమీటర్ల పొడవున 1.46 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. మొత్తం రూ. 700 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనుల్లో ఇప్పటివరకు సుమారు రూ. 600 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని వివరించారు. మిగిలిన భూసేకరణకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా మంజూరు చేసిందని, నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. కోర్టు కేసులు లేదా భూ సంబంధిత సమస్యల కారణంగా ఎక్కడైనా పనులు ఆలస్యమైతే వెంటనే జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. చిన్న చిన్న భూ సమస్యల కారణంగా వేల కోట్ల వ్యయం జరిగే పనులు నిలిచిపోవడం సమంజసం కాదని, రైతులతో చర్చించి సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యలను సమయానికి తెలియజేయకుండా పనులు నిలిపివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అధికారుల సమన్వయం అత్యవసరం
ఆయకట్టు ఖమ్మం జిల్లా పరిధిలో ఉండగా, నిర్మాణ పనులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అటవీ, పోలీస్ శాఖల అధికారులు నిరంతరం సమన్వయంతో ఉంటూ అడ్డంకులను తొలగించాలని కోరారు. కోర్టు కేసుల కారణంగా మరో ఒక కిలోమీటర్ కాలువ పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా వెంటనే జిల్లా కలెక్టర్లు లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని, ప్రాజెక్టు పూర్తి కావడంలో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. యాతాలకుంట టన్నెల్ నిర్మాణంపై గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కేవలం రెండు సంవత్సరాల్లో టన్నెల్ను పూర్తి స్థాయికి తీసుకువచ్చినట్లు గుర్తుచేశారు. ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్, సూపరింటెండింగ్ ఇంజనీర్ ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి రాత్రింబవళ్లు పనిచేయాలని మంత్రి ఆదేశించారు.
ఎనిమిది నియోజకవర్గాలకు గోదావరి జలాలు
రాజీవ్ కాలువ స్టెబిలైజేషన్ ద్వారా ఇప్పటికే సుమారు 1.35 లక్షల ఎకరాలకు నీరు అందించామని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ సంవత్సరం నాగార్జునసాగర్ జలాలు అందకపోయినా వైరా ఆయకట్టు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాలకు గోదావరి జలాలను మళ్లించే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా సత్తుపల్లి ట్రంక్ కాలువ ద్వారా వేంసూరు, దమ్మపేట మండలాలకు కూడా నీరు అందించవచ్చని తెలిపారు. నాలుగో పంప్ హౌస్ పనులు పూర్తి అయితే వచ్చే సంవత్సరం అశ్వరావుపేట, దమ్మపేట మండలాలకు గోదావరి జలాలు అందించవచ్చని వివరించారు. దీనివల్ల మొత్తం 110 కిలోమీటర్ల మేర కాలువ వ్యవస్థ పూర్తవుతుందని, మూడు పంప్ హౌస్లను వినియోగించి ఉభయ జిల్లాల్లోని 8 నియోజకవర్గాలకు సాగునీరు సరఫరా చేసే అవకాశం కలుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పాలేరు ప్రాంతానికి నీరు చేరాలంటే జూలూరుపాడు టన్నెల్ పనులు పూర్తి కావాలని, దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. అలాగే మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ను పూర్తి చేసి పినపాక నియోజకవర్గంలో 16,500 ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. ఈ సమావేశంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్, మట్టా దయానంద్, ప్రజాప్రతినిధులు, ఉభయ జిల్లాల ఇంజనీరింగ్, ఇరిగేషన్, పోలీస్, ఫారెస్ట్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో టెండర్లు పిలిచామని, జిల్లా యంత్రాంగం భూసేకరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేస్తేనే ఉభయ జిల్లాలను సస్యశ్యామలంగా మార్చగలమని ఆయన స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ పనుల నాణ్యతను పరిశీలించాలని, రైతులకు సాగునీరు అందించే విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

